
లింఖేడ (గుజరాత్): నల్లధనం దాచుకున్న దొంగలకు సాయం చేసేందుకే ప్రధాని పెద్దనోట్లను రద్దుచేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అదొక ఏకపక్ష, వెర్రి చర్య అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో రాహుల్ బుధవారం దాహొద్ జిల్లాలోని లింఖేడలో సభలో మాట్లాడారు. ‘నోట్లరద్దుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు పూర్తిగా ధ్వంసం కాలేదని మోదీ తెలుసుకున్నారు. వారి జీవితాలను మరింత నాశనం చేయడానికే జీఎస్టీ తెచ్చారు’ అని రాహుల్ దుయ్యబట్టారు.
జీఎస్టీపై జాగ్రత్తగా వ్యవహరించాలనీ, ఎక్కువ సంఖ్యలో శ్లాబులు పెట్టి దానిని ప్రతిబంధకంగా మార్చవద్దని ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచించిందని చెప్పారు. నోట్లరద్దుతో దేశమంతా ఇబ్బందులు పడ్డసమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ కంపెనీల ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపించారు. మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ విద్య, ఆరోగ్య రంగాలపై ఖర్చుచేయాల్సిన నిధులను పారిశ్రామిక వేత్తల కోసం వెచ్చించారన్నారు. ‘అచ్ఛేదిన్’ మోదీ, అమిత్ షాలకు మాత్రమేనన్నారు.