
సాక్షి, శ్రీనగర్ : దేశంలోకి ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుమతించకపోవడంపై హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మాన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని మతరాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ట్విటర్ వేదికగా హురియత్ నేత కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామింగ్ బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇస్లామ్ చట్టాల ప్రకారం విధులు నిర్వహించే ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.