ఇష్రత్ జహాన్‌పై లాలు కొడుకు తీవ్ర వ్యాఖ్యలు

ఇష్రత్ జహాన్‌పై లాలు కొడుకు తీవ్ర వ్యాఖ్యలు - Sakshi


పట్నా: గుజరాత్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇష్రత్‌ జహాన్‌ గురించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె 'బిహార్ ఆడబిడ్డ' అని పేర్కొన్నారు. ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబా సూసైడ్ బాంబర్‌ అని తాజాగా ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్‌ హెడ్లీ తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2004లో ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ సమయంలో ఆమెను 'బిహార్ ఆడబిడ్డ'గా నితీశ్ అభివర్ణించారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తేజ్‌ప్రతాప్ ఇష్రత్‌ జహన్‌ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదం రేపుతున్నది.



ఇష్రత్ మృతి వ్యవహారంలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే అప్పట్లో నితీశ్‌కుమార్ దేశభద్రతపై రాజీపడి.. వ్యాఖ్యలు చేశారని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్ విమర్శించారు. ఇష్రత్‌ను బిహార్ బిడ్డగా అభివర్ణించినవాళ్లు హెడ్లీ వాంగ్మూలం నేపథ్యంలో ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. మరోవైపు ఇష్రత్ జహాన్ కుటుంబం మాత్రం తమ బిడ్డ అమాయకురాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఆమెను పోలీసులు హతమార్చారని ఆరోపిస్తున్నది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top