Sakshi News home page

భారత్‌ ‘ధ్రువ’ మాకొద్దు : మాల్దీవులు

Published Wed, Apr 4 2018 12:26 PM

Maldives Asks To Take Back India Helicopter - Sakshi

న్యూఢిల్లీ : మిత్రబంధానికి నిదర్శనంగా భారత్‌ ఇచ్చిన ధ్రువ హెలికాప్టర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరింది. సముద్ర తలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు రెండు హెలికాప్టర్లను( వీటిలో ధ్రువ హెలికాప్టర్‌ ఒకటి) భారత్‌ మాల్దీవులకు ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఒప్పందాన్ని పొడిగించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

తాజాగా గడువు ముగియడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాల్దీవులు భావిస్తోంది. ధ్రువ్‌ హెలికాప్టర్‌కు బదులు డార్నియర్‌ రవాణా విమానాన్ని ఇవ్వాలని మాల్దీవులు కోరుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. హిందూ మహా సముద్రంలో మన లక్షదీవులకు చేరువలో మాల్దీవులు ఉంది.

భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. భారత్‌ మాల్దీవులకు ఎప్పటినుంచో రక్షణ కల్పిస్తూ వస్తోంది. అయితే, మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యమీన్‌ గయూమ్‌ గద్దెనెక్కిన నాటి నుంచి చైనాతో సంబంధాలకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని దీవులను చైనాకు లీజుకు కూడా ఇచ్చారు.

ప్రతిపక్ష నేతలను విడుదల చేయమని సుప్రీం కోర్టు తీర్పు అనంతరం మాల్దీవుల్లో 45 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మధ్యవర్తిగా భారత్‌ మధ్యవర్తిత్వాన్ని ఆ దేశం తిరస్కరించింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం మాల్దీవుల్లో పాకిస్తాన​ సైన్యాధికారి జావేద్‌ బాజ్వా పర్యటించారు.

కాగా, హెలికాప్టర్‌లను తిరిగి ఇవ్వడంపై మాల్దీవులతో భారత్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ధ్రువ హెలికాప్టర్లను శత్రువులపై వినియోగించకుండా ఉండే ఒప్పందంపై భారత్‌ ఇజ్రాయెల్‌కు కూడా లీజ్‌కు ఇచ్చింది.

Advertisement
Advertisement