
కావేరిపై భగ్గుమన్న కర్ణాటక
తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో మంగళవారం నిరసనలు మిన్నంటాయి.
తమిళనాడుకు నీటి విడుదలపై కన్నడ సంఘాల బంద్
- 10 రోజులు 15 వేల క్యూసెక్కుల చొప్పున ఇవ్వండి: సుప్రీం ఆదేశం
సాక్షి,బెంగళూరు: తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో మంగళవారం నిరసనలు మిన్నంటాయి. తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని విడుదల చేయాలని సోమవారం కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో కావేరీ రాజకీయాలకు కేంద్రమైన మాండ్యా జిల్లా మంగళవారం భగ్గుమంది. ఆందోళనకారులు బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మంగళవారం ఉదయం నుంచి మాండ్యా జిల్లాలో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్ని బలవంతంగా మూయించారు.
కావేరీ నదీ పరివాహకం ప్రాంతంలో వందలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపారు. కృష్ణరాజసాగర్ డ్యాం చుట్టుపక్కలా నిషేధాజ్ఞలు విధించారు. కావేరి ప్రవహిస్తోన్న మైసూరు, హసన్ జిల్లాలతో పాటు బెంగళూరు, హుబ్లీ, తుమకూరు, చామరాజనగరలో కూడా ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు సుప్రీం ఉత్తర్వుల్ని పాటిస్తూ తమిళనాడుకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళవారం మంత్రులు, అధికారులు, ప్రతిపక్ష నేతలతో చర్చల అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. సుప్రీం తీర్పును అమలు చేయడంలో ఉన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ మార్పులతో కూడిన పిటిషన్తో ఆ కోర్టును ఆశ్రయిస్తామన్నారు.