ప్రధాన మైలురాయిని దాటిన చంద్రయాన్‌-2: శివన్‌

ISRO Chairman Shivan Speech After Chandrayaan 2 Enter Into Moon - Sakshi

సాక్షి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్‌-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ధృవీకరించారు. దీంతో చంద్రయాన్‌-2 ప్రధాన మైలురాయిని దాటిందని తెలిపారు. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుంటూ సరిగ్గా 9:20 గంటలకు కక్ష్యలోకి చేరింది.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివన్‌ మాటట్లాడుతూ.. అత్యంత కీలక ఘట్టాన్ని సమర్థవంతంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. చంద్రుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ ‌2న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోతుందని, 3న ఆర్బిటర్‌ పనితీరును పరిశీలిస్తామని శివన్‌ వివరించారు. వచ్చే నెల 7న ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడిపై దిగనుందని తెలిపారు. 

(చదవండి: చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌–2)

బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.  చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ అన్నారు.  గత నెల 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top