'దక్షిణాది రాష్ట్రాల యువతపై ఐఎస్ ప్రభావం' | Sakshi
Sakshi News home page

'దక్షిణాది రాష్ట్రాల యువతపై ఐఎస్ ప్రభావం'

Published Mon, Dec 28 2015 9:12 AM

IS influencing youth in south India says NIA chief

లక్నో: ఇస్లామిక్ ఉగ్రవాదుల భావజాల వ్యాప్తి భారత్కు ప్రధాన ముప్పుగా పరిణమిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ శరద్ కుమార్ తెలిపారు. ఐఎస్ ప్రభావం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల యువతపై ఎక్కవగా ఉందన్నారు. లక్నోలో ఎన్ఐఏ నూతన భవనం శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలలో ఉగ్రవాద భావజాలం చాలా తక్కువగా ఉందన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం భారత్లో ఇంకా వేళ్లూనుకోలేదని తెలిపారు. అయితే ఇంటర్నెట్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని తెలిపారు. దీనికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇటీవలి కాలంలో నకిలీ కరెన్సీ దేశానికి పెద్ద సమస్యగా మారిందని శరద్ కుమార్ తెలిపారు. దేశంలో సుమారు 25 వేల కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ చెలామణిలో ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా నకిలీ కరెన్సీకి హబ్గా మారిందని తెలిపారు.

Advertisement
Advertisement