హిమాచల్లో కుప్పకూలిన యుద్ధవిమానం
సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం కూలిపోయింది. పంజాబ్లోని పటాన్కోట్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్ డివిజన్ పట్టా జతియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
కాగా భారత వాయుసేన యుద్ధవిమానం కూలిన ఘటన ఇటీవల ఇది మూడవది కావడం గమనార్హం. గత నెలలో గుజరాత్, మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ 5న జామ్నగర్ ఎయిర్ బేస్లో బయలుదేరిన జాగ్వర్ యుద్ధ విమానం కచ్ జిల్లాలో కూలిపోవడంతో సీనియర్ అధికారి మరణించారు. ఇక జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ద్రాక్ష తోటలో సుఖోయ్-30 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు.