చైనా ఒత్తిడికి తలొగ్గిన భారత్ | India Withdraws Visa To Chinese Dissident Leader: Sources | Sakshi
Sakshi News home page

చైనా ఒత్తిడికి తలొగ్గిన భారత్

Apr 25 2016 10:55 AM | Updated on Aug 7 2018 4:13 PM

చైనా ఒత్తిడికి తలొగ్గిన భారత్ - Sakshi

చైనా ఒత్తిడికి తలొగ్గిన భారత్

పొరుగుదేశం చైనా ఒత్తిడికి భారత్ తలొగ్గింది. చైనాలో తిరుగుబాటు నేత, వరల్డ్‌ విఘర్‌ కాంగ్రెస్‌ (డబ్ల్యూయూసీ) నాయకుడు దొల్కన్‌ ఇసాకు మంజూరు చేసిన వీసాను కేంద్రం రద్దు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: పొరుగుదేశం చైనా ఒత్తిడికి భారత్ తలొగ్గింది. చైనాలో తిరుగుబాటు నేత, వరల్డ్‌ విఘర్‌ కాంగ్రెస్‌ (డబ్ల్యూయూసీ) నాయకుడు దొల్కన్‌ ఇసాకు మంజూరు చేసిన వీసాను కేంద్రం రద్దు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనున్న సదస్సు కోసం  దోల్కన్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై నిషేధం విధించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో చైనా మోకాలొడ్డింది. ఈ నేపథ్యంలో ఇసాకు వీసా మంజూరు చేసి కేంద్రం దీటైన సమాధానం ఇచ్చిందని భావించారు.

భారత్ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. చైనాలోని కల్లోలిత జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదానికి డబ్ల్యూయూసీ మద్దతు తెలుపుతోందని చైనా ఆరోపించింది. దోల్కన్కు వీసా రద్దు చేయాలని భారత్పై ఒత్తిడి తెచ్చింది. ఇసా ఉగ్రవాది అని, అతనిపై ఇంటర్‌పోల్‌ రెడ్ కార్నర్‌ నోటీసు కూడా జారీచేసిందని, అతన్ని చట్టముందుకు తీసుకురావడానికి అన్ని దేశాలు సహకరించాలని కోరింది. దీంతో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్ పర్యటనకు వచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇసా చెప్పాడు. తనకు వీసా ఇచ్చినందుకు చైనా అసంతృప్తిగా ఉందని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement