
'రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు'
కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తనను ఒక రాజకీయ వస్తువుగా వాడుకుంటున్నారని వాపోయాడు.
ఢిల్లీ: కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తనను ఒక రాజకీయ వస్తువుగా వాడుకుంటున్నారని వాపోయాడు. హర్యానా బీజేపీ ప్రభుత్వం వాద్రా భూముల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆదివారం వాద్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. కుటుంబ రాజకీయాలతో తన వ్యాపారాన్ని ముడిపెడుతూ ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడం సరికాదన్నాడు.
తనపై విమర్శలను స్థిరంగా కొనసాగిస్తున్నారని తెలిపిన ఆయన ప్రజల దృష్టి మరల్చడం కోసం కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. విమర్శకులు తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ వారు నిజాలతో సంబంధం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. భూముల వ్యవహారంలో జరుగుతున్న విచారణలో భాగంగా వాద్రాకు చెందిన కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నోటీసులు అందిన తరువాత స్పందిస్తాను. విచారణ దశలో ఉన్నప్పుడు నేను దీనిపై మాట్లాడటం సరికాదన్నాడు.