సిలబస్లో లేని సబ్జెక్టులకు మార్కులా? | Huge discrepancy in Narendra Modi's MA degree, claims ex-Gujarat university professor | Sakshi
Sakshi News home page

సిలబస్లో లేని సబ్జెక్టులకు మార్కులా?

May 13 2016 2:01 PM | Updated on Aug 24 2018 2:17 PM

సిలబస్లో లేని సబ్జెక్టులకు మార్కులా? - Sakshi

సిలబస్లో లేని సబ్జెక్టులకు మార్కులా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి 1983లో మోదీకి జారీ చేసిన...

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి 1983లో మోదీకి జారీ చేసిన మాస్టర్‌ డిగ్రీ మార్కుల జాబితాలో పేర్కొన్న సబ్జెక్టులేవీ కూడా అసలు సిలబస్‌లోనే లేవని అప్పటి యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జయంత్‌ పటేల్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో ఆరోపించారు. ఆయన 1969 నుంచి 1983 వరకు యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

నరేంద్ర మోదీకి ఎంఏ సెకండ్‌ ఇయర్‌లో పొలిటికల్‌ సైన్స్‌లో 64 మార్కులు, యూరోపియన్‌ అండ్‌ సోషల్‌ పొలిటికల్‌ థాట్స్‌లో 62, మోడరన్‌ ఇండియా, పొలిటికల్‌ అనాలసిస్‌లో 69, పొలిటికల్‌ సైకాలోజిలో 67 మార్కులు వచ్చినట్లు మార్కుల మెమోలో పేర్కొన్నారని, తనకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఇంటర్నల్‌ పరీక్షలకుగానీ, ఎక్స్‌టర్నల్‌ పరీక్షలకుగానీ ఈ సబ్జెక్టులేవీ లేవని జయంత్‌ పటేల్‌ తెలిపారు. అసలు ఎన్నడూ కాలేజీకి సరిగ్గా రాని మోదీకి పరీక్షల్లో ఇన్ని మార్కులు ఎలా వచ్చాయో తనకు ఆశ్చర్యంగా ఉందని అదే యూనివర్శిటీలో పనిచేసి రిటైరైన మాజీ ప్రొఫెసర్‌ ఒకరు మొన్ననే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

జయంత్‌ పటేల్‌ చేసిన తాజా ఆరోపణలను గుజరాత్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మహేళ్‌ పటేల్‌ ఖండించారు. మార్కులు పేర్కొన్న షీట్లు 30 ఏళ్ల క్రితం తయారు చేసినవని, అందులో పేర్కొన్న సబ్జెక్టులు మాత్రం ఆ సమయంలో సిలబస్‌లో ఉన్నవేనని ఆయన వివరించారు. నరేంద్ర మోదీ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపిస్తున్న ఢిల్లీ డిప్యూటి ముఖ్యమంత్రి సిసోడియా వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు గురువానం జాయింట్‌ తనిఖీ కోసం ఢిల్లీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ యోగోష్‌ త్యాగికి ఓ సుదీర్ఘ లేఖ రాశారు. మోదీ సర్టిఫికెట్ల గురించి యూనివర్శిటీలో సంయుక్తంగా తనిఖీ చేసి, వాటి వివరాలను యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో వెల్లడిద్దామని ఆ లేఖలో సిసోడియా కోరారు.

ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి తమ యూనివర్శిటీలో చదువుకుంటే ఏ యూనివర్శిటీ అయినా గొప్పగా ఆ విషయాన్ని చాటుకుంటుందని, కానీ మోది సర్టిఫికెట్లపై వివాదం ఏర్పడినప్పుడు కూడా వాస్తవాలతో ముందుకు రావాల్సిన ఢిల్లీ యూనివర్శిటీ ఎందుకు వెనకడుగు వేస్తోందని సిసోడియా మీడియా ముందు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement