కరోనా ప్రకంపనలు: హెల్ప్‌లైన్‌ | Sakshi
Sakshi News home page

కరోనా ప్రకంపనలు: హెల్ప్‌లైన్‌

Published Sat, Jan 25 2020 8:36 PM

Govt urges people to  report coronavirus symptoms sets up helpline - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విమానాశ్రయాల వద్ద కఠినమైన స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన 11మంది వైరస్ బారిన పడ్డారన్న అనుమానాలతో పరిశీలనలో ఉన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు ,తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తమను సంప్రదించాలని కోరింది. ఇందుకు 24x7 హెల్ప్‌లైన్  + 91-11-23978046ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చైనాలో ఉన్న లేదా అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వచ్చే ప్రయాణికులను కొన్ని "డాస్ అండ్ డోంట్స్" (చేయవలసిన, చేయకూడని పనులు) జాబితాను అనుసరించమని మంత్రిత్వ శాఖ కోరింది. ఈ ఏడాది జనవరి 1 నుండి చైనానుంచి తిరిగి వ్యక్తులు స్వచ్ఛందంగా అధికారులకు నివేదించాలని  సీనియర్‌  అధికారి ఒకరు కోరారు.

కేరళ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వారు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెల్ప్‌లైన్‌ను ఏర్పటు చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరింది. అలాగే చైనాలో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతుంటే చైనాలోని భారత రాయబార కార్యాలయానికి నివేదించాలని పేర్కొంది. దీంతోపాటు భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ప్రయాణికులు అనారోగ్యంతో బాధపడుతుంటే, వెంటనే విమానయాన సిబ్బందికి తెలియజేయాలనీ,తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, కుటుంబ సభ్యులు లేదా ఇతర ప్రయాణికులతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది.  

మరోవైపు చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్ష నిర‍్వహించారు. క్యాబినెట్ కార్యదర్శి, హోం వ్యవహారాల కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, రక్షణ, కార్యదర్శి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి  సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో, కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన ఇటీవలి పరిణామాలు, సంసిద్ధత, ప్రతిస్పందన చర్యలపై అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఆసుపత్రి సంసిద్ధత, ప్రయోగశాలల సంసిద్ధత, రాపిడ్ రెస్పాన్స్ బృందాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తీసుకున్న చర్యలతోపాటు మంత్రిత్వ శాఖ చేపట్టిన విస్తృతమైన కార్యకలాపాలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. అలాగే పౌర విమానయాన, ఇతర మంత్రిత్వ శాఖలు తీసుకున్న నివారణ చర్యలను కూడా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయంతో ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు ప్రధాన కార్యదర్శికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్స్‌ను సిద్ధం చేశామనీ, అన్ని రాష్ట్ర,  జిల్లా ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేశారు.

ఇప్పటికే  చైనాలో 41 మందని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి మరో 1,300 మందికి పైగా సోకింది. అనేక ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం హాంకాంగ్‌లో 5, మకావోలో ఇద్దరు, తైవాన్‌లో ముగ్గురు, థాయ్‌లాండ్‌లో 4, జపాన్‌లో 2, దక్షిణ కొరియాలో 2, అమెరికాలో 2 వియత్నాంలో3 , సింగపూర్లో 3, నేపాల్ -1, ఫ్రాన్స్‌లో ఒకరు ఈ వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే.

చదవండి :  ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు
కరోనా ఎయిరిండియా, ఇండిగో కీలక నిర్ణయం

Advertisement
Advertisement