నోకియా 3110 పేలి యువతి మృతి

Girl Dies After Mobile Phone Explodes In Odisa - Sakshi

జర్సుగుడ : ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడితే, మొబైల్స్‌ పేలిపోతున్న ఘటనలు ఇటీవల తరచు వింటూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే ఫోన్‌ మాట్లాడుతూ.. తీవ్ర ప్రమాద బారిన పడుతున్నారు. ఇదే మాదిరి ఒడిశాలో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ 18 ఏళ్ల యువతి మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి, ఫోన్‌ మాట్లాడుతుండగా.. దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి.

చాలామంది చేసే మాదిరిగానే ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగానే.. ఉమా తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్‌ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్ట‍ర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఆ సెల్‌ ఫోన్‌ నోకియా 3110 మోడల్‌ అని తెలిసింది. 

భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉమా మాట్లాడుతుందని, ఆ సమయంలో ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోవడంతో, దానికి ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడిందని ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్‌ ఓరమ్‌ చెప్పాడు. గతేడాదే లాంచ్‌ అయిన నోకియా ఫోన్‌ వల్ల ఈ ఘటన జరగడంతో, ఈ మొబైల్‌ తయారీ కంపెనీ తగిన పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top