పట్టాలు తప్పిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్
కటక్: సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ గార్డ్ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.