2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి | Enforcement Directorate Has Speeded Up The Investigation Of Nirav Modi Case | Sakshi
Sakshi News home page

2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి

Jun 11 2020 2:08 AM | Updated on Jun 11 2020 10:53 AM

Enforcement Directorate Has Speeded Up The Investigation Of Nirav Modi Case - Sakshi

న్యూఢిల్లీ:  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ(48), మెహుల్‌ చోక్సీ(60)పై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్‌లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్‌ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్‌ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి.

ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్‌ నుంచి దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్‌లో నీరవ్‌ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీజ్‌ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్‌లో అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement