ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ | Encounter in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Mar 19 2017 1:39 AM | Updated on Oct 9 2018 2:53 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతిచెందారు

ఆరుగురు మావోలు హతం

చర్ల/చింతూరు:  ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతిచెందారు.  ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన ఒక మావోను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దంతెవాడ జిల్లా ఆరంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బర్రెంపారా గ్రామ సమీప అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్, జిల్లా రిజర్వు పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. జవాన్లు దాడిని దీటుగా తిప్పికొట్టారు. గంటకుపైగా ఇరువైపులా కాల్పులు జరిగాయి.

ఘటనాస్థలం నుంచి ఆరుగురు మావోల మృతదేహాలను, ఒక ఏకే 47, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో ఒకరిని మలన్‌గిరి ఏరియా కమిటీ కార్యదర్శిగా, మరొకరిని ఆ కమిటీ సభ్యురాలిగా గుర్తించారు. నక్సల్స్‌ కాల్పుల్లో కానిస్టేబుళ్లు నిర్మల్‌ నేతమ్, సుక్రమ్‌ గాడ్వేలు చనిపోయారని తెలిపారు. గాయపడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లు డోగేందర్‌ పాల్‌ పాత్రో, సింగ్‌రాణా రాణా, కానిస్టేబుల్‌ ముకేష్‌ తట్టిలతోపాటు ఒక మావోయిస్టును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement