ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్‌ మృతదేహం | Delhi Clashes Intelligence Bureau Officer Found Dead in Chand Bagh | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అల్లర్లు: ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ మృతి

Feb 26 2020 2:05 PM | Updated on Feb 26 2020 4:34 PM

Delhi Clashes Intelligence Bureau Officer Found Dead in Chand Bagh - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని భగ్గుమంటోంది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో సోమవారం మొదలైన ఘర్షణలు.. నేటికీ తగ్గుముఖం పట్టలేదు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఢిల్లీలో పర్యటిస్తుండగానే మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జఫరాబాద్‌లలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఇక ఈ ఘర్షణల్లో ఇప్పటికే హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ మృతి చెందగా.. మంగళవారం రాత్రి ఇంటలెజిన్స్‌ విభాగం కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ మృత్యువాత పడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌ బాగ్‌లో బుధవారం ఉదయం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అంకిత్‌ శర్మపై దాడి చేసి.. ఆయనను హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఆయన మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసినట్లు తెలుస్తోంది.(ఢిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతుల సంఖ్య!)

కాగా 2017లో అంకిత్‌ శర్మ ఇంటలిజెన్స్‌ బ్యూరోలో చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంకిత్‌ శర్మ తండ్రి రవిందర్‌ శర్మ మాట్లాడుతూ... ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఓ నాయకుడి అనుచరులే తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. తనను కొట్టి.. ఆ తర్వాత కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రవిందర్‌ శర్మ కూడా ఐబీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక అల్లర్ల నేపథ్యంలో పులచోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ మంగళవారం రాత్రి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. గోకుల్‌పురి చౌక్‌, సీలంపూర్‌, జఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. (దారుణం: తలలోకి డ్రిల్లింగ్‌ మెషీన్‌ దింపేశారు!)

ఢిల్లీ అల్లర్లు: సమగ్ర కథనాల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement