‘ఉపసంహరణ’ పూర్తి.. | Deadline for withdrawal of nominations ended | Sakshi
Sakshi News home page

‘ఉపసంహరణ’ పూర్తి..

Oct 1 2014 10:42 PM | Updated on Sep 2 2017 2:14 PM

నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది.

 సాక్షి, ముంబై: నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగడంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ జరగనుంది. మరోవైపు ఈసారి కూడా దాదాపు అన్ని పార్టీల్లోనూ తిరుగుబాటుదారుల బెడద కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,646 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో పరిశీలన పూర్తి తర్వాత 6494  నామినేషన్లు మిగిలాయి.

కాగా చాలా మంది బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి వల్వీ తెలిపారు. అయితే ఉపసంహరించుకున్న వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని రాత్రి పది గంటల సమయంలో ‘సాక్షి’కి చెప్పారు.  ఈసారి ఇండిపెండెంట్లతోపాటు పలు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు కూడా రద్దు కావడం విశేషం. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ పార్టీల అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

 పృథ్వీరాజ్ చవాన్  కోసం ఎన్సీపీ అభ్యర్థి ఉపసంహరణ..
 కరాడ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రికృతమైన దక్షిణకరాడ్ అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఎన్సీపీ ఊరటనిచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి రాజేంద్ర యాదవ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దక్షిణ కరాడ్ అసెంబ్లీ నుంచి పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేయనున్నారని తెలిసినతర్వాత స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులైన విలాస్‌కాకా ఉండాల్కర్‌కు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 అంతటితో ఆగకుండా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు.  దీంతో చివరి రోజున ఎన్సీపీ రాజేంద్ర యాదవ్ నామినేషన్‌ను వెనక్కితీసుకోవాలని సూచించి,     విలాస్ కాకాకు మద్దతు ప్రకటించింది.   

 ఉపసంహరించుకున్న బీజేపీ అభ్యర్థి  రమేష్ మాత్రే..
 అసెంబ్లీ ఎన్నికల వాడివేడి కొనసాగుతున్న తరుణంలో కళ్యాణ్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రమేష్ మాత్రే తన నామినేషన్‌ను వెనక్కితీసుకున్నారు. ఈ సంఘటన బీజేపీకి షాక్‌నిచ్చిందని చెప్పవచ్చు. మొదట శివసేన టికెట్ ఆశించిన మాత్రేకు ఆ పార్టీ మొండిచేయి చూపడంతో తిరుగుబాటుచేసి రమేష్ మాత్రే బీజేపీలో చేరి కళ్యాణ్ రూరల్ నుంచి శివసేన అభ్యర్థి సుభాష్ భోయిర్‌కు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అయితే చివరి రోజు ఊహించని విధంగా రమేష్ మాత్రే నామినేషన్ వెనక్కితీసుకోవడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

 వర్సోవా అసెంబ్లీ శివసేన అభ్యర్థి నామినేషన్ రద్దు...
 పశ్చిమ అంధేరిలోని వర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన టికెట్‌పై బరిలోకి దిగిన రాజు పటేల్ నామినేషన్ ఫారాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం రద్దు చేసింది. నామినేషన్‌తోపాటు ప్రతి/్ఞ పత్రాన్ని జతపరచపోవడంతో నామినేషన్‌ను రద్దుచేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే ఈ విషయంపై రాజు పటేల్ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

Advertisement
 
Advertisement
Advertisement