గాడ్సే దేశాన్ని రక్షించారంటూ వివాదాస్పద పోస్ట్‌

Currency Replacing Mahatma Gandhis Image With Nathuram Godses in MP - Sakshi

భోపాల్‌: రూ. 10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్‌ గాడ్సే బొమ్మను క్లోన్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్‌ శుక్లాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ శుక్లా ఫేస్‌బుక్‌లో  'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని శివమ్‌ శుక్లా ఈ పోస్ట్‌ చేసినట్లు తెలిపారు.

మరో పోస్ట్‌లో.. రఘుపతి రాఘవ రాజా రామ్‌, దేశ్‌ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌లో 'శుక్లా గాడ్సేను మహాత్మా' అని సంభోదించి.. 'పూజ్య పండిట్‌ నాథూరాం గాడ్సే అమర్‌ రహీన్‌' అంటూ పోస్ట్‌ చేశారు. ఇదే విషయంపై నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌యూఐ) కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసింది. కాగా నవంబర్‌ 15, 1949న 'ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌'ను హతమార్చినందుకు గాడ్సేను అంబాలా జైలులో ఉరితీసిన సంగతి తెలిందే. చదవండి: గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top