
24నే సివిల్స్ ప్రిలిమ్స్
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 24వ తేదీననే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 24వ తేదీననే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గురువారం లోక్సభలో ప్రకటించారు. ఈ సమావేశాల తరువాత ఈ అంశంపై యూపీఎస్సీ సహా సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ‘సీశాట్ పేపర్పై అనుకూలంగా, వ్యతిరేకంగా.. భిన్నరకాల వాదనలున్నాయి.
అందువల్ల దీనిపై రాజకీయ పార్టీలతో, ఇతర సంబంధిత వర్గాలతో లోతైన చర్చ, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్పై కూడా చర్చించాల్సి ఉంది. ఇదంతా ఈ 15 రోజుల్లో పూర్తికాదు. అందువల్ల షెడ్యూల్ ప్రకారమే 24న ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది’ అని వెంకయ్యనాయుడు వివరించారు.