సీబీఐ చేతికి తమిళనాడు కస్టడీ డెత్‌ కేసు

Centre Permits CBI To Take Over Probe In TN Father Son Duo Custody Death Case - Sakshi

చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బెనిక్స్‌- జయరాజ్‌ కస్టోడియల్‌ కేసును సీబీఐకి అప్పగించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా ఈ కేసును ప్రస్తుతం సీబీ- సీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు)

ఐదుగురి అరెస్టు
లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్‌(59), బెనిక్స్‌(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టగా వారు మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్‌ హైకోర్టు.. జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించగా.. మెజిస్ట్రేట్‌ ఇటీవలే నాలుగు పేజీల నివేదిక అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్‌ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం హత్యానేరం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.(కస్టడీ డెత్‌: పోలీసుల అరెస్టు.. స్థానికుల సంబరాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top