ముండే మృతిపై అనుమానాలు? | Sakshi
Sakshi News home page

ముండే మృతిపై అనుమానాలు?

Published Tue, Jun 10 2014 4:03 PM

ముండే మృతిపై అనుమానాలు? - Sakshi

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే ప్రమాదంలోనే మరణించారా.. లేక ఆ ప్రమాదాన్ని ఎవరైనా సృష్టించారా? ఇలాంటి అనుమానాలు ఎవరికి మొదలయ్యాయో గానీ, ముండే మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్లు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి, ముండే మరణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసిన తర్వాత ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు నుంచి కింద పడి మెడకు, కాలేయానికి గాయాలు కావడం, దానివల్ల షాక్, హెమరేజి సంభవించడంతో గోపీనాథ్ ముండే మరణించిన విషయం తెలిసిందే. పార్టీలో తీవ్ర అవమానాల పాలు కావడంతో ఒకానొక సమయంలో గోపీనాథ్ ముండే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావించినట్లు మహారాష్ట్రకు చెందిన పార్టీ నాయకుడు పాండురంగ్ ఫండ్కర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు నాయకులకు అనుమానాలు రావడంతో ఇప్పుడు ముండే మరణంపై సీబీఐ విచారణ కోరుతున్నారు.

Advertisement
Advertisement