రేప్‌కు మరణదండన! | Cabinet nod to introduce Bill for death penalty for rape of girls | Sakshi
Sakshi News home page

రేప్‌కు మరణదండన!

Jul 19 2018 3:50 AM | Updated on Jul 19 2018 10:13 AM

Cabinet nod to introduce Bill for death penalty for rape of girls - Sakshi

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిస్తున్న రవిశంకర్‌

న్యూఢిల్లీ: 12 ఏళ్ల లోపున్న బాలికలపై అత్యాచారం చేసిన కేసులో దోషులకు మరణశిక్ష ప్రతిపాదిస్తూ బిల్లును కేంద్రం ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే ఆర్డినెన్స్‌ రద్దవుతుంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు..
     
► 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారిపై రేప్‌కు పాల్పడి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష(జీవితఖైదుగా పొడిగించొచ్చు) లేదా మరణ దండన విధిస్తారు. సామూహిక అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష వేస్తారు.

► మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను జీవితఖైదుగా పొడిగించే వెసులుబాటు కల్పించారు.

► 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై రేప్‌కు పాల్పడితే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దీన్ని కూడా జీవితఖైదుగా మార్చొచ్చు.

► అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేయాలి.

► అప్పీళ్లను 6 నెలల్లోగా పరిష్కరించాలి.

► 16 ఏళ్ల లోపున్న బాలికపై రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్‌ జారీ చేయడంపై ఎలాంటి ప్రస్తావన లేదు.

► ఒకవేళ వారికి బెయిల్‌ మంజూరీపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, 15 రోజుల ముందే బాధితురాలి తరఫు లాయరు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు.


కేబినెట్‌ ఇతర నిర్ణయాలు
► ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆమోదం.

► చెరకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.20 పెంపు. దీంతో అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే సీజన్‌ నుంచి మిల్లులు రైతులకు క్వింటాలు చెరకుకు కనీసం రూ.275 చెల్లించాలి.

► జైలులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధ ఖైదీలకు   కేంద్రం క్షమాబిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. శిక్షను కనీసం సగం పూర్తిచేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ అక్టోబర్‌ 2, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10, వచ్చే ఏడాది అక్టోబర్‌ 2న దఫాల్లో వారికి విముక్తి కలిగించనున్నారు. అయితే వరకట్న హత్యలు, అత్యాచారాలు, మనుషుల అక్రమ రవాణా, పోటా, టాడా, ఫెమా లాంటి తీవ్ర నేరాల్లోని దోషులకు ఈ పథకం వర్తించదు.

► మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో 81 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్ల సాయానికి అనుమతి.

► మైనారిటీ విద్యార్థులకు ప్రిమెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను 2020 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.5 వేల కోట్లకు వ్యయం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement