
తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చంఢీగర్ : బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టు తలుపు తట్టారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్పై అమృత్సర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భారతీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హరియాణ హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరపు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు.
(చదవండి : చిక్కుల్లో ఆ ముగ్గురు)
కాగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీ సింగ్ క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద అమృత్సర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్సర్ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25 వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టొద్దని కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
(చదవండి : రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..)