బెనారస్ వర్శిటీలో 'అతడి'పై అత్యాచారం | Sakshi
Sakshi News home page

బెనారస్ వర్శిటీలో 'అతడి'పై అత్యాచారం

Published Wed, Aug 24 2016 5:36 PM

బెనారస్ వర్శిటీలో 'అతడి'పై అత్యాచారం - Sakshi

వారణాసి: ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్శిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఏ హిందీ ప్రథమ సంవత్సరం విద్యార్థి (19)ని కిడ్నాప్ చేసి అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.  పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై లంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. విద్యార్థిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు కూడా ధ్రువీకరించారు.

కాగా దీనిపై వైస్ ఛాన్సులర్ గిరిష్ చంద్ర త్రిపాఠి పెదవి విప్పడం లేదు. అయితే ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగటం లేదని వర్శిటీ అధికారులే అంగీకరిస్తున్నారు. విచారణ చేయటంలో పోలీసులు జాప్యం  చేస్తుంటే తామేమీ చేయగలమని చెబుతున్నారు. ప్రస్తుతం వీసీ అందుబాటులో లేరని, ఆయన తిరిగి వచ్చాక ఈ ఘటనపై కమిటీ వేయనున్నట్లు చెప్పారు.

మరోవైపు బాధిత విద్యార్థి కుటుంబం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ తమ కుటుంబం మొత్తం షాక్లో ఉందని, దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఘటన జరగటం సిగ్గు చేటు అన్నారు. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరిగేవరకూ పోరాడతామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement