లోక్‌సభలో ఆజం ఖాన్‌ క్షమాపణ

Azam Khan Apologises For His Remark In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, లోక్‌సభ అధ్యక్ష స్ధానంలో కూర్చున్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్‌ సోమవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. రమాదేవి తన సోదరి వంటిదని తాను గతంలోనే పలమార్లు చెప్పానని, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడాలనేది తన అభిమతం కాదని స్పష్టం చేశారు. తాను మాట్లాడే భాష, మేనరిజమ్స్‌ గురించి పార్లమెంట్‌లో అందరికీ తెలుసునని, తాను పొరపాటుగా వ్యాఖ్యానిస్తే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

కాగా సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యే ముందు ఆజం ఖాన్‌ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. సభాధ్యక్ష స్ధానాన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆజం ఖాన్‌ క్షమాపణను బీజేపీ ఎంపీ రమాదేవి అంగీకరించలేదు. ఆజం ఖాన్‌ వైఖరి మహిళలను, దేశాన్ని బాధించిందని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతున్నారని, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడే తన పద్ధతి మార్చుకోవాలని రమాదేవి హెచ్చరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top