ఇక పంతుళ్ల జాతకం విద్యార్థుల చేతుల్లో..! | At Cusat, students to evaluate teachers' performance | Sakshi
Sakshi News home page

ఇక పంతుళ్ల జాతకం విద్యార్థుల చేతుల్లో..!

Jun 17 2016 8:42 AM | Updated on Sep 4 2017 2:44 AM

ఇప్పటి వరకు టీచర్లు విద్యార్థులకు పరీక్షలు పెట్టి మార్కులు వేయడం విన్నాం. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే తిట్టో కొట్టో తిరిగి సక్రమ మార్గంలో పెట్టడం చూశాం.

తిరువనంతపురం: ఇప్పటి వరకు టీచర్లు విద్యార్థులకు పరీక్షలు పెట్టి మార్కులు వేయడం విన్నాం. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే తిట్టో కొట్టో తిరిగి సక్రమ మార్గంలో పెట్టడం చూశాం. కానీ, కేరళలో ఇక నుంచి పిల్లల చేతిలో ఉపాధ్యాయులే పరీక్షలు ఎదుర్కోనున్నారు. అది కూడా పెద్ద విద్యార్థుల చేతిలో. ఆ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే పై అధికారులు వారిని శిక్షించనున్నారు. అవునూ.. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఏ ఒక్క వర్సిటీ కూడా అమలుచేయకపోతుండగా ఒక్క కేరళలోని కొచ్చి వర్సిటీ మాత్రం ఈ నిబంధనను కఠినంగా అమలుచేయనుంది.

విద్యావ్యవస్థను పటిష్టపరిచే లక్ష్యంగా యూనివర్సిటీ విద్యార్థుల సెమిస్టర్ చివరిలో ప్రొఫెసర్ల పనితీరు ఎలా ఉంది? వారు క్లాస్ లు ఎలా చెబుతున్నారు? తరగతి వాతావరణం ఎలా ఉంది? కోర్సుకు సరైన న్యాయాన్ని వారు చేస్తున్నారా? వంటి విషయాలకు సంబంధించిన ఒక ప్రత్యేక పేపర్ ఇచ్చి అందులో విద్యార్థులతో ఆయా కోర్సులకు సంబంధించిన ప్రొఫెసర్ల చిట్టా విప్పనుంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కుసాత్) ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనికుంటుంది. అయితే, దీనిపట్ల ప్రొఫెసర్ల, టీచర్ల సంఘాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ నిబంధనను అమలుచేయాలని యూజీసీ 2013లోనే ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement