Cochin University
-
రైతులకు అండగా ‘టాప్కో’
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్కు ముందు క్రాప్ కేలండర్ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు. పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు. -
Kerala Stampede: కొచ్చిన్ వర్సిటీలో తొక్కిసలాట... నలుగురు విద్యార్థుల దుర్మరణం
కొచ్చి: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘోరం జరిగింది. వర్సిటీ టెక్ ఫెస్ట్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. మరో 64 మందికి విద్యార్థులు పైగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. వర్షం, మెట్లే కారణం! సంగీత విభావరి వర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఏర్పాటైంది. ప్రఖ్యాత నేపథ్య గాయని నికితా గాంధీ తదితరులు రావడంతో ఏకంగా 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. విభావరి ఊపులో ఉండగా ఉన్నట్టుండి వర్షం కురవడంతో వెనక వైపున్న వాళ్లంతా తల దాచుకునేందుకు ముందుకు తోసుకొచ్చారు. ఆ తాకిడిని తాళలేక వేదిక ముందున్న వాళ్లంతా బయటికి పరుగులు తీశారు. అదే సమయంలో బయట తడుస్తున్న వాళ్లు కూడా లోనికి తోసుకొచ్చారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆడిటోరియంలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ఒకటే ద్వారం ఉండటంతో చూస్తుండగానే అక్కడ తోపులాట పెరిగిపోయింది. పలువురు విద్యార్థులు ఎత్తయిన మెట్ల మీది నుంచి పడిపోయారు. వారిని మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీయడంతో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దారుణంపై కేరళ సీఎం పినరాయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులను వెంటనే వర్సిటీకి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. విద్యార్థులు భారీగా రావడం, ఆకస్మిక వర్షమే ప్రమాదానికి దారి తీసినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ శంకరన్ అభిప్రాయపడ్డారు. -
క్యాంపస్లో సరస్వతీ పూజ : వర్సిటీ అధికారుల అనుమతి
తిరువనంతపురం : విద్యార్ధుల నిరసనలతో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తమ అలప్పుజ క్యాంపస్లో సరస్వతి పూజకు అనుమతించింది. శాంతియుతంగా పూజ నిర్వహించాలని సూచిస్తూ వర్సిటీ వారిని అనుమతించింది. కొచ్చిన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అభ్యసిస్తున్న ఉత్తరాది విద్యార్ధుల ఆందోళనలతో పూజలకు వర్సిటీ అధికారులు అనుమతించారు. తొలుత వర్సిటీ సెక్యులర్ క్యాంపస్ అని, ఇక్కడ మతపరమైన ప్రార్థనలు, పూజలకు అనుమతించబోమని కొచ్చిన్ వర్సిటీ అధికారులు స్పష్టం చేసినా ఉత్తరాది విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో ఈనెల 9,10,11 తేదీల్లో క్యాంపస్లో శాంతియుతంగా సరస్వతి పూజ నిర్వహించుకోవాలని అనుమతించారు. గత ఏడాది సైతం పూజలకు అనుమతించారని విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో కొచ్చిన్ వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్లతో కూడిన ఉన్నతస్ధాయి కమిటీ సరస్వతీ పూజకు అనుమతించిందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. -
గల్ఫ్లో ఘనత చాటిన భారతీయుడు
కేరళలోని కొల్లాయం సమీపంలోని చావరా పట్టణంలో 1953 సెప్టెంబర్ 2న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు బి.రవిపిళ్లై. వ్యవసాయ నేపథ్యంలో పుట్టిపెరిగినా, రవి పిళ్లైకి చిన్నప్పటి నుంచి వ్యాపారంపైనే మక్కువ ఉండేది. కొచ్చిన్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న కాలంలోనే చిట్ఫండ్ వ్యాపారాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో భవిష్యత్తు బాగుంటుందనే అంచనాతో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వ్యాపారంలోకి దిగారు. ఎరువులు, రసాయన పరిశ్రమలో దిగ్గజాలైన ట్రావెన్కోర్ లిమిటెడ్, కొచ్చిన్ రిఫైనరీస్ వంటి సంస్థల కాంట్రాక్టులు నిర్వహించేవారు. రవి పిళ్లై వ్యాపార ప్రస్థానం వేగం పుంజుకున్న దశలో అనుకోని అవాంతరం. కార్మికుల నిరవధిక సమ్మెతో ఆయన రోడ్డున పడ్డారు. కొంత దిగులు చెందినా, త్వరలోనే తేరుకున్నారు. ఏదైనా సాధించాలనే తపనతో 1978లో సౌదీ అరేబియాలో అడుగుపెట్టారు. భారతీయ కార్మికశక్తి...ఆయన ఆస్తి సౌదీలో రవి పిళ్లై తొలుత చిన్నా చితక వ్యాపారాలు చేశారు. రెండేళ్ల తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. అల్ హజ్రీ అనే వ్యాపారితో కలిసి 120 మంది కార్మికులతో నసీర్ అలీ హజ్రీ కార్పొరేషన్ను స్థాపించారు. కంపెనీకి కావలసిన కార్మికులను రవి తమిళనాడులోని నాగర్కోయిల్ నుంచి తీసుకెళ్లారు. 1983 కల్లా వ్యాపారం గాడిలోపడింది. ఫ్రెంచ్ కంపెనీ నుంచి విమానాల అండర్ గ్రై ండ్ పార్కింగ్ ప్రాజెక్ట్ను సబ్ కాంట్రాక్ట్కు తీసుకోని విజయం సాధించటంతో రవి పేరు అక్కడి వ్యాపార వర్గాల్లో మార్మోగింది. అదే సమయంలో గల్ఫ్ ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ వేగం పెంచటం రవికి కలిసొచ్చింది. అప్పట్లో అక్కడ కొరియన్ కంపెనీలదే హవా. ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ప్లాంట్లు నిర్మాణం భారతీయుల వల్ల కాని పని అనేవారు. రవి మాత్రం అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ తన తెలివితేటలతో అందిపుచ్చుకున్న ప్రతి ప్రాజెక్ట్ను విజయవంతంగా నిర్వహించారు. ఒప్పందానికన్నా తక్కువ ఖర్చులో నాణ్యతలో రాజీ పడకుండా పని పూర్తి చేయటం ఆయన ప్రతిష్టను పెంచింది. దీనికోసం భారతీయ కార్మికుల శ్రమ శక్తి, నైపుణ్యాలను సమర్థంగా వాడుకొని విజయబావుటా ఎగురవేశారు. ప్రస్తుతం ఆర్పీ గ్రూప్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 70 వేలయితే అందులో 50 వేల మంది భారతీయులే. వారి యోగక్షేమాల పట్ల ఆయనకు అపారమైన శ్రద్ధ. కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ప్రతినెలా ఉద్యోగులకు బోనస్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అంతేకాదు, ఆర్పీ గ్రూప్లో కార్మికుల కోసం 24 గంటలూ నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతారు. దుబాయ్లో స్థిరాస్థి వ్యాపారం... నసీర్ అల్హజ్రీ కార్పొరేషన్ అనతి కాలంలోనే రవి హస్తగతమై, ఆర్పీగ్రూప్గా మారింది. పిళై ్ల 60వ పడిలోకి ప్రవేశించినా తన ప్రయాణానికి విరామం ఇవ్వలేదు. 2006 నాటికి ఆర్పీ గ్రూప్ను అనేక వ్యాపారాలకు విస్తరించింది. ఆయన ఆస్తుల విలువ రూ.18 వేల కోట్లకుపైనే. ఫోర్బ్స్ భారత సంపన్నుల్లో 38వస్థానంలో నిలిచారు. విద్య, ఆతిథ్య, సిమెంట్, స్టీల్, ఆయిల్, గ్యాస్, పర్యాటకం పరిశ్రమల్లోను అడుగుపెట్టారు. ఖతార్, బహ్రెయిన్, ఇండియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపారాన్ని విస్తరించారు. స్వరాష్ట్రం కేరళలో ఆతిథ్య, వైద్య వ్యాపారాల్లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. సేవా కార్యక్రమాలు... పిళ్లైని ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. సేవారంగంపై మక్కువతో ఆయన ఆర్పీ ఫౌండేషన్ స్థాపించి విద్యా, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, శిశుసంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టిటళ్లు నిర్వహిస్తున్నారు. పేదలకు సామూహిక వివాహాలు జరిపించి. ప్రతి జంటకు రూ. 1.5 లక్షలు ఇస్తారు. దంపతులు నిరుద్యోగులయితే తమ గ్రూప్లోనే వారి అర్హతకు తగిన ఉద్యోగం ఇస్తున్నారు. - దండేల కృష్ణ -
ఇక పంతుళ్ల జాతకం విద్యార్థుల చేతుల్లో..!
తిరువనంతపురం: ఇప్పటి వరకు టీచర్లు విద్యార్థులకు పరీక్షలు పెట్టి మార్కులు వేయడం విన్నాం. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే తిట్టో కొట్టో తిరిగి సక్రమ మార్గంలో పెట్టడం చూశాం. కానీ, కేరళలో ఇక నుంచి పిల్లల చేతిలో ఉపాధ్యాయులే పరీక్షలు ఎదుర్కోనున్నారు. అది కూడా పెద్ద విద్యార్థుల చేతిలో. ఆ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే పై అధికారులు వారిని శిక్షించనున్నారు. అవునూ.. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఏ ఒక్క వర్సిటీ కూడా అమలుచేయకపోతుండగా ఒక్క కేరళలోని కొచ్చి వర్సిటీ మాత్రం ఈ నిబంధనను కఠినంగా అమలుచేయనుంది. విద్యావ్యవస్థను పటిష్టపరిచే లక్ష్యంగా యూనివర్సిటీ విద్యార్థుల సెమిస్టర్ చివరిలో ప్రొఫెసర్ల పనితీరు ఎలా ఉంది? వారు క్లాస్ లు ఎలా చెబుతున్నారు? తరగతి వాతావరణం ఎలా ఉంది? కోర్సుకు సరైన న్యాయాన్ని వారు చేస్తున్నారా? వంటి విషయాలకు సంబంధించిన ఒక ప్రత్యేక పేపర్ ఇచ్చి అందులో విద్యార్థులతో ఆయా కోర్సులకు సంబంధించిన ప్రొఫెసర్ల చిట్టా విప్పనుంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కుసాత్) ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనికుంటుంది. అయితే, దీనిపట్ల ప్రొఫెసర్ల, టీచర్ల సంఘాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ నిబంధనను అమలుచేయాలని యూజీసీ 2013లోనే ఆదేశాలు జారీ చేసింది.


