గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలకు శ్రీకారం
దేశీ వరికి ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర చెల్లింపు
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.
గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు.
అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు.
ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్కు ముందు క్రాప్ కేలండర్ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు.
పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు.
ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.
వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు.


