అమిత్‌ షా కొడుకుపై విపక్షాల ఫైర్‌ | Amit Shah's Son Jay Shah Says Will Sue Website For 100 Crores For Defamatory Story | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా కొడుకుపై విపక్షాల ఫైర్‌

Oct 9 2017 3:32 AM | Updated on Sep 22 2018 8:25 PM

Amit Shah's Son Jay Shah Says Will Sue Website For 100 Crores For Defamatory Story - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ అమిత్‌ షాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జయ్‌ షా డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల టర్నోవర్‌ అసాధారణ రీతిలో భారీగా పెరిగిందంటూ ఒక న్యూస్‌ వెబ్‌సైట్‌ ఇటీవల బయటపెట్టింది. జయ్‌కు చెందిన ‘టెంపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ కంపెనీ టర్నోవర్‌ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16,000  రెట్లు పెరిగిందనీ, పెరిగిన డబ్బు విలువ రూ.80 కోట్లని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది.

ఆయనకు 60 శాతం వాటా ఉన్న ‘కుసుమ్‌ ఫిన్‌సర్వ్‌ ఎల్‌ఎల్‌పీ’ కంపెనీ నిజానికి స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేది అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓ పవన విద్యుత్తు ప్రాజెక్టు ఆ సంస్థకు దక్కిందని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌ నేత  సిబల్‌ మాట్లాడుతూ ‘దేశానికి ప్రధాన సేవకుడిని అని చెప్పుకున్న మోదీని అడుగుతున్నా. ఆయన ఇప్పుడేం చెప్తారు? వారిని అరెస్టు చేసి దీనిపై విచారణ జరపమని  ఆదేశిస్తారా?’ అని అన్నారు. కాగా వెబ్‌సైట్‌లో ప్రచురితమైనదంతా అసత్యమని, వెబ్‌సైట్‌పై రూ.వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ జయ్‌ ఇచ్చిన ఒక ప్రకటనను కేంద్రమంత్రి పియూశ్‌గోయల్‌ మీడియాకు చూపారు.

Advertisement
 
Advertisement
Advertisement