టిఫిన్‌బాక్స్‌ గొడవతో విమానం ఆలస్యం

Air India flight delayed after spat over pilot lunch box - Sakshi

యశవంతపుర: టిఫిన్‌ బాక్స్‌ను శుభ్రం చేయడంపై విమానం పైలట్, క్యాబిన్‌ క్రూ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ కారణంగా ఎయిరిండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. సోమవారం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఏఐ–772 విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా  విచారణకు రావాల్సిందిగా పైలట్, సిబ్బందిని ఆదేశించింది. మొదట తెచ్చిన లంచ్‌ చల్లబడటం వల్ల దీనిని వేడి చేసి ఇవ్వాలని కెప్టెన్‌ విమానంలోని ఓ పురుష అటెండెంట్‌కు సూచించారు. సిబ్బంది అలాగేనని వేడి చేసి తెచ్చిచ్చారు. లంచ్‌ ఆరగించిన కెప్టెన్, ఖాళీ బాక్స్‌ను శుభ్రం చేసి ఇవ్వాలని ఓ సిబ్బందిని కోరారు. పదేపదే పనులు పురమాయిస్తున్నారంటూ సిబ్బంది కెప్టెన్‌తో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కెప్టెన్‌ అసలు పనిని వదిలేసి గొడవలో మునిగిపోవడంతో విమానం రెండు గంటలు నేలమీదనే ఉండిపోయింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top