కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్‌

After Pulwama Terror Attack Protesters Force Karachi Bakery To Cover Sign Board - Sakshi

బెంగళూరు:  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యావత్‌ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్‌ కళాకారులపై నిషేధం విధించింది. చివరికి నదీ జలాలను కూడా ఆపేశారు. ఇక పాక్‌ వ్యక్తులను, పేర్లను, అనుకూలమైన వారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (బుద్ధి చూపించుకున్న పాక్‌)

తాజాగా పుల్వామా దాడి ప్రభావం కరాచీ బేకరీపై పడింది. బేకరీ పేరులో పాకిస్తాన్‌కు చెందిన పట్టణం ‘కరాచీ’  ఉందంటూ ఆ బేకరీ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ క్రమంలో తాము పాకిస్తాన్‌కు చెందిన వాళ్లం కాదని భారతీయలమే అంటే బేకరీ యాజమాన్యం ఆందోళనాకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో బేకరీ పేరులోని కరాచీ కనపడకుండా క్లాత్‌తో కప్పివేశారు. అంతేకాకుండా బేకరీపై మువ్వన్నెల జెండా కూడా ఎగిరేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. (పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు)    

1953లో హైదరాబాద్‌ వేదికగా కరాచీ బేకరీ
దేశ విభజన సమయంలో ఖాన్‌ చంద్‌ రమణి అనే వ్యక్తి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1953లో ఆయన హైదరాబాద్‌ వేదికగా కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధిపొందినది. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబందం లేదని వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (పాక్‌తో భారత్‌ ఆడకుంటే నష్టమేనా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top