సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ.. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదస్పదంగా మారింది. తాజాగా లండన్ వేదికగా జరిగిన ఈ వేలంలో అబ్రార్ అహ్మద్ను 1.90 లక్షల పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది.
అయితే భారత్ను కించపరిచేలా వ్యవహరించిన పాక్ ఆటగాడిని తీసుకోవాల్సిన అవసరం ఏముందని సన్రైజర్స్ యాజమాన్యంపై విమర్శల వర్షం కురుస్తోంది. దీంతో సన్రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా సైతం సస్పెండ్ అయింది. ఈ వివాదంపై బీసీసీఐ స్పందించింది. "ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము" అని బీసీసీఐ వైస్ ప్రెసెడింట్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
అబ్రార్ డౌటే?
కాగా అబ్రార్ భారీ ధరకు అమ్ముడైనప్పటికీ, అతడు ఈ టోర్నీలో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ది హండ్రెడ్ లీగ్ టోర్నీ జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు జరగనుంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్కు వెళ్లనుంది. ఈ సిరీస్ జూలై 15 నుండి ఆగస్టు 7 వరకు జరగనుంది. దీంతో జాతీయ విధుల కారణంగా అబ్రార్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఎన్వోసీ ఇచ్చిన అతడు పూర్తి స్ధాయి టోర్నీకి అందుబాటులో ఉండడం కష్టమే.
అదేవిధంగా అబ్రార్ను జట్టులోకి తీసుకోవడంపై సన్రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ వివరణ ఇచ్చారు. ఈ వేలంలో నాణ్యమైన స్పిన్నర్ను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇంగ్లండ్ అదిల్ రషీద్కు ప్రత్నామ్యంగా మరొకరిని తీసుకోవాలని అనుకున్నాము. కానీ మాకు లోకల్గా సరైన ఆప్షన్లు కనిపించలేదు. అందుకే ఓవర్సీస్ ప్లేయర్స్ అయిన రిషాద్ హుస్సేన్, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్లను పరిశీలించాం. చివరి అహ్మద్ను తీసుకున్నాము అని వెట్టోరీ వెల్లడించాడు.
కాగా గతంలో 'నార్తర్న్ సూపర్చార్జర్స్'గా ఉన్న ఈ ఫ్రాంచైజీని సన్ టీవీ సుమారు 100 మిలియన్ పౌండ్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసింది. ఇందులో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుండి 49%, యార్క్షైర్ నుండి 51% వాటాను సన్గ్రూప్ దక్కించుకుంది.
చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్!!


