12 కుటుంబాల సామాజిక బహిష్కరణ

12 Families Social Boycott In Uttar Pradesh - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణలు ఇప్పటీకి కొనసాగుతున్నాయి. చర్చికి వెళ్తున్నారంటూ 12 కుటుంబాలను సైనీ కమ్యూనిటికి చెందిన పెద్దలు కుల పంచాయతీ పెట్టి సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన యూపీలోని మోరానాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మోరానాబాద్‌కు చెందిన 12 సైనీ కుటుంబాలు ఇటీవల క్రీస్టియన్‌ మతంలోకి మారి, చర్చికి వెళ్తున్నారని సైనీ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. తమ కుల కట్టుబాట్లకు ఇది విరుద్దమని అందుకే వారిని  బహిష్కరించినట్లు కుల పెద్ద శివలాల్‌ సైనీ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వారు చర్చ్‌కి వెళ్తున్నారని, దీనిపై కులంలోని 300 మంది సభ్యులతో చిర్చించిన అనంతరం వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబంపై ఐదువేల జరిమాన కూడా విధించినట్లు ఆయన తెలిపారు. బహిష్కరణకు గురైన కుటుంబంలో ఏలాంటి కార్యక్రమాలు జరిగిన ఎవరు హాజరు కావద్దని, వారితో ఎవరు కూడా మాట్లాడవద్దని కుల పంచాయతీ తీర్మానించినట్లు సైనీ వెల్లడించారు. షాపుల్లో ఏలాంటి సమాన్లు కూడా వారికి విక్రయించకూడదని గ్రామంలోని షాపులను హెచ్చరించారు.

తాము క్రీస్టియన్‌ మతంలోకి వెళ్లలేదని, కేవలం ప్రశాంతత కోసమే చర్చ్‌కి వెళ్తున్నామని బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం తప్పుడు సమాచారంతోనే తమ కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top