‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

Subtitlist Rekhs Slams Makers Lyca Productions For Non Payment Of Dues - Sakshi

చెన్నై :  సౌత్‌ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే ప్రముఖ సబ్‌టైటిలిస్ట్‌ రేఖ్స్‌ రజనీ-అక్షయ్‌ కుమార్‌ మూవీ 2.ఓ నిర్మాతలపై ఫైర్‌ అయ్యారు. ఈ సినిమాకు తనకు రావాలల్సిన బకాయిలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తనకు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. పది నెలలు గడిచినా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

2.ఓ తెలుగు, తమిళ్‌ వెర్షన్‌కు తాను సబ్‌టైటిల్‌ వర్క్‌ చేసినా తనకు ఇంకా పేమెంట్‌ అందలేదని ఆమె ట్విటర్‌లో తన ఆవేదన వెళ్లగకక్కారు. సినిమా గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా తనకు రావాల్సిన మొత్తం సెటిల్‌ చేసేందుకు నిర్మాతలకు పదినెలల సమయం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, తాను పలుమార్లు వారికి మెసేజ్‌లు, మెయిల్‌, కాల్స్‌ చేసినా స్పందన లేదని వాపోయారు. సినిమాలకు వెన్నెముక వంటి సబ్‌టైటిల్స్‌ పనులు చేసేవారి శ్రమకు ఫలితం అందడం లేదని చెప్పుకొచ్చారు.

రానున్న రోజుల్లో తనతో వర్క్‌ చేయించుకునే నిర్మాతలకు తమ పరిస్ధితి తెలియాలనే ఉద్దేశంతోనే తాను ట్వీట్‌ చేస్తున్నానని చెప్పారు. 2.ఓ మూవీకే కాకుండా కమల్‌ హాసన్‌, గౌతమ్‌ మీనన్‌, నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ల నుంచి కూడా తనకు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.  కాగా లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. తాము అందరికీ సకాలంలో చెల్లింపులు జరిపామని, ఎవరికీ బకాయి లేమని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించి ఆమెకు చెల్లింపులు జరిపిన విషయం నిర్ధారించాలని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కోరారని చెప్పారు. తన పనికి డబ్బు చెల్లించలేదని ఆరోపించడం ఆమెకు అలవాటని లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top