మరో పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు!

మరో పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు!


 - దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

 ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని, ‘సుస్వాగతం’తో యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ‘సుడిగాడు’ చిత్రం తర్వాత మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి, ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పీడున్నోడు’. తమిళ చిత్రం ‘సుందరపాండ్యన్’కి ఇది రీమేక్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

 డి.జె. వసంత్ అందించిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి హీరోయిన్ తమన్నాకు అందించారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ -‘‘బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడంటే తన తల్లిదండ్రుల తర్వాత ఆనందపడేది నేనే. ‘అల్లుడు శీను’లో డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడని అందరూ అన్నారు. ఈ సినిమాతో బాగా నటించాడని పేరొస్తుంది.

 

  తను పెద్ద హీరో అవుతాడు’’ అని పేర్కొన్నారు. ‘‘భీమనేనిగారు చెప్పిన కథ నన్ను హాంట్ చేసింది. ఇంత మంచి క్లయిమాక్స్, నటనకు హై స్కోప్ ఉన్న మూవీని వదులుకోకూడదని ఈ చిత్రం చేశా. మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు భీమనేనిగారికి థ్యాంక్స్’’ అని సాయి శ్రీనివాస్ తెలిపారు. ‘‘ఒక రీమేక్ చిత్రం కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ‘సుడిగాడు’ తర్వాత వసంత్‌కు మంచి అవకాశాలు రాలేదు. ఈ మూడేళ్లు తను నాతో పనిచేశాడు.

 

  ప్రేక్షకులు నన్ను మరో ఐదు, పదేళ్లు గుర్తుపెట్టుకునే చిత్రం అవుతుంది’’ అని భీమనేని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు అనిల్ రావిపూడి, కళాదర్శకుడు-నిర్మాత చంటి అడ్డాల, కెమెరామెన్ విజయ్ ఉలగనాథన్, సంగీతదర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, రచయిత చంద్రబోస్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్,  హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, కేథరిన్, హెబ్బా పటేల్, పూర్ణ, సాక్షి చౌదరి, హాసిని తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top