ఆ చారిత్రక ఘట్టానికి 63 ఏళ్లు!

Six Decades Ago Darjeeling Tea Workers Protest - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డార్జిలింగ్‌ టీగా స్థానికంగా పిలిచే ‘మార్గరెట్స్‌ హోప్‌ టీ’ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండుల్లో ఒకటి. దీని యజమాని గుడ్‌రీక్‌ గ్రూప్‌. ఆరు దశాబ్దాల క్రితం అంటే 1955, జూన్‌ 25వ తేదీన (సరిగ్గా నేటికి 63 ఏళ్లు) కొండల్లో నెలవైన ఈ టీ గార్డెన్‌లోకి సుత్తీ కొడవలి గుర్తును కలిగిన ఎర్రని జెండాను చేతపట్టుకొని కాలి లింబుని అనే 12 ఏళ్ల బాలిక దూసుకొచ్చింది. అప్పటికే ఆ టీ గార్డెన్‌ మేనేజర్‌ భవనానికి 50 మీటర్ల ఇవతల కొన్ని వందల మంది టీ గార్డెన్‌ కార్మికులు నిలబడి గొంతెత్తి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 12 ఏళ్ల లింబుని కూడా వారితో గొంతును కలిపి గట్టిగా నినాదాలు చేయడం అక్కడి కార్మికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘నారి సంఘటన్‌’ సభ్యులుగా ఉన్న అనేక మంది మహిళలు కూడా కార్మికుల ముందు వరుసలో నిలబడి నినాదాలు చేస్తున్నారు. వారిలో లింబుని తల్లి కూడా ఉంది.

సమీపంలో ఉన్న దిలారామ్‌ టీ ఎస్టేట్‌లో సమ్మె చేస్తున్న కార్మికులను పనుల్లో చేరాల్సిందిగా పోలీసులు బలవంతం చేస్తున్నారన్న వార్త తెలియడంతో అక్కడికి వెళ్లి అక్కడి కార్మికులకు మద్దతు తెలపాలని మార్గరెట్స్‌ హోప్‌ టీ కార్మికులు అటువైపు కదంతొక్కారు. మార్గమధ్యంలో వారికి పలుసార్లు తుపాకీ కాల్పులు వినిపించాయి. అయినా వెరవకుండా దిలారామ్‌ టీ ఎస్టేట్‌లోకి కార్మికులు పరుగులు తీశారు. వారి వెంట పరుగెత్తికెళ్లిన లింబునికి కళ్ల ముందు ఏదో పేలిన శబ్దం వినిపించింది. కాసేపు ఏదీ కనిపించలేదు. కళ్లు మంటలెత్తుతున్నాయి. చుట్టూ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికాసేపటికి కళ్లు నులుముకుంటూ తేరిపార చూస్తే ఇద్దరు మహిళలు సహా ఆరుగురు కార్మికులు రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేటికీ బతికున్న నాటి 12 ఏళ్ల బాలిక లింబుని నాటి సంఘటన గురించి మీడియాకు చెప్పుకొచ్చారు.

టీ గార్డెన్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారతీయ గోర్ఖా లీగ్‌లు ఇచ్చిన పిలుపు మేరకు మార్గరెట్స్‌ హోప్, దిలారామ్‌ టీ ఎస్టేట్లతోపాటు ముండా, బాలాసన్, మహారాణి టీ ఎస్టేట్లలో సమ్మె జరిగింది. జూన్‌ 22వ తేదీనే సమ్మె ప్రారంభంకాగా, 25వ తేదీన అది కాల్పులకు దారితీసింది. ఆ మరుసటి రోజు దాదాపు 20 వేల మంది కార్మికులు డార్జిలింగ్‌ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులను పెద్ద ఎత్తున మొహరించి ఎంతోమంది కార్మిక నాయకులను అరెస్ట్‌ చేశారు. వారిలో సీపీఐ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఆందోళనను మరింత తీవ్రం చేయడంతో టీ ఎస్టేట్‌ యజమానులు దిగొచ్చారు. రోజుకు కనీస వేతనంగా కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఆరు అణాల (దాదాపు 38 పైసలు) నుంచి ఎనిమిది అణాలకు (దాదాపు 50 పైసలు) పెంచారు. మొదటిసారి బోనస్‌ ప్రకటించారు. మహిళలకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు.

ఈ డార్జిలింగ్‌ సంఘటన పశ్చిమ బెంగాల్‌ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోయింది. 1948, నవంబర్‌ నెలలోనే భారత ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చినా టీ ఎస్టేట్‌ కార్మికులకు అమలు కాలేదు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ఈ చట్టాన్ని 2017లో కూడా సవరించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర కార్మికులకే కనీస వేతనాలను కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రంలోని కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలను నిర్ణయించాల్సింది ఆయా రాష్ట్రాలదే. నాటి పోలీసు కాల్పుల్లో మరణించిన ఆరుగురు కార్మికుల సంస్మరణార్థం డార్జిలింగ్‌ హిల్స్‌పై ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. పాత స్థూపం పాడైపోగా, కొత్త స్థూపాన్ని సీపీఎం నుంచి విడిపోయిన ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ రెవల్యూషనరీ మార్క్సిస్ట్స్‌’ పార్టీ 2004 నుంచి జూన్‌ 25వ తేదీన స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని నాటి సమ్మెలో పాల్గొన్న లాక్‌మోతీ దేవన్‌ మనవడు సలీమ్‌ సుబ్బా తెలిపారు.

డాక్టర్‌ అభానిరంజన్‌ తాలపత్ర స్ఫూర్తి
నాటి టీ గార్డెన్స్‌ కార్మికులు సమ్మెకు సీపీఐకి చెందిన డాక్టర్‌ అభానిరంజన్‌ స్ఫూర్తినిచ్చారని నక్సల్బరి ఉద్యమకారుల్లో ఒకరైన చారు మజుందార్‌ కుమారుడు అభిజిత్‌ మజుందార్‌ వివరించారు. ఆయన ‘యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ టీ గార్డెన్‌ వర్కర్స్‌’కు జాయింట్‌ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం వంద కిలోమీటర్ల దూరంలో మైదాన ప్రాంతంలో నివసిస్తున్న డాక్టర్‌ అభానిరంజన్‌ టీ కార్మికుల వైద్య అవసరాల గురించి తెలుసుకొని తేయాకు కొండలపైకి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పట్లో కార్మికుల కాళ్లకు చెప్పులుకానీ బూట్లుగానీ ఉండేవి కావు. పురుగు పుట్ర జొరబడకుండా నిండైన దుస్తులు కూడా ముఖ్యంగా ఆడవాళ్లకు ఉండేవి కావు. ప్రతిరోజు రాత్రి వారిళ్లకు డాక్టర్‌ వెళ్లి గాయాలకు, ఇన్ఫెక్షన్లకు వైద్యం చేసేవారు. ప్రతిరోజు తేయాకు తోటలో పనికాగానే కార్మికులు చేతులు కడుక్కునేందుకు ఆ డాక్టర్‌ ఐయోడిన్‌ సొల్యూషన్‌ను తయారు చేసి ఇచ్చారు. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ కార్మికులను సమ్మెకు పురిగొల్పారు.

తెభాగా ఉద్యమంలో కూడా
1946–47లో జరిగిన తెభాగా ఉద్యమంలో కూడా డాక్టర్‌ అభానిరంజన్‌ పాల్గొన్నారని అభిజిత్‌ మజుందార్‌ తెలిపారు. పండించిన పంటలో సగం కాకుండా మూడొంతుల పంటను ఇవ్వాలంటూ కౌలు రైతులు చేసిన ఉద్యమం అది. ప్రధానంగా ఆ ఉద్యమమే నక్సల్బరి ఉద్యమానికి నాంది పలకగా, ఆ ఉద్యమ నాయకులకు కూడా టీ గార్డెన్‌ కార్మికుల సమ్మె స్ఫూర్తినిచ్చిందని మజుందార్‌ మీడియాకు వివరించారు.  మార్గరెట్స్‌ హోప్‌ టీ గార్డెన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్సల్బరిలో 1967లో రైతుల సాయుధ పోరాటం జరిగింది. డార్జిలింగ్‌ జిల్లా సిలిగురి సబ్‌డివిజన్‌లో నక్సల్బరి ప్రాంతం ఉంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో చారు మజుందార్‌ ఒకరు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top