ఇంట్లోకి చొరబడిన వ్యక్తిపై శ్రుతిహాసన్ ఫిర్యాదు

ఇంట్లోకి చొరబడిన వ్యక్తిపై శ్రుతిహాసన్ ఫిర్యాదు - Sakshi


తన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన గుర్తుతెలియని వ్యక్తిపై హీరోయిన్ శ్రుతిహాసన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లోకి మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అక్రమంగా చొరబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో శ్రుతిహాసన్ తన అపార్టుమెంట్లో ఉండగా డోర్ బెల్ మోగింది. ఆమె తలుపు తీయగానే అగంతకుడు లోనికి చొరబడ్డాడు. తనను ఎందుకు గుర్తు పట్టడంలేదంటూ నిలదీశాడు.



అంతేకాదు.. ఆ నిందితుడు శ్రుతి భుజాలపై చేతులు కూడా వేశాడు. చివరకు ఎలాగోలా అతడిని బయటకు తోసేసి, తలుపు లోపల నుంచి తాళం పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన శ్రతి, పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేసింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 354, సెక్షన్ 452ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ శివాజీ కోలేకర్ తెలిపారు.



ఇంతకుముందు కొన్ని సందర్భాలలో తన సినిమా సెట్లు కొన్నింటిలో కూడా ఆ నిందితుడు కనిపించాడని శ్రుతి హాసన్ తెలిపింది. అలాగే మహబూబ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ స్టూడియోల వద్ద కూడా అతగాడిని ఇంతకుముందు చూశానంది. పోలీసులు శ్రుతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. సందర్శకుల డైరీలో అతడు తనపేరు 'అశోక్' అని రాశాడు. అయితే అది తప్పుడు పేరు కావచ్చని పోలీసులు అంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top