ఆద్య.. డాటర్ ఆఫ్‌ రేణూ | Sakshi
Sakshi News home page

రేణూ-ఆద్య.. ఓ ఎమోషనల్ ఘటన

Published Sun, Oct 15 2017 9:37 AM

Renu Desai Emotional Incident with Aadya - Sakshi

సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ కాస్త గ్యాప్ తర్వాత ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఓ రియాల్టీ షోకు న్యాయ నిర్ణేతగా ఆమె వ్యవహరిస్తుండటం.. దీంతో పలు ఛానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయటం... వాటిల్లో ఆమె తన వైవాహిక జీవితం గురించి కామెంట్లు చేయటం... అవి వివాదాస్పదం కావటం... పవన్‌ ఫ్యాన్స్‌పై రేణు ఫైర్‌ కావటం ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. 

ఈ నేపథ్యంలో ఆమె కొన్ని యూట్యూబ్‌ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదాంట్లో తనకు తన పిల్లలకు మధ్య బాండింగ్ గురించి ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆకట్టుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం రేణు ‘ఆర్తో ఇమ్యూన్‌ కండిషన్‌’తో బాధపడింది. దీనికి తోడు గుండెకు సంబంధించి ఓ సమస్య తలెత్తటంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో  తనకి-కూతురు ఆద్యకి మధ్య జరిగిన ఓ భావోద్వేగ ఘటన గురించి ఆమె వివరించారు. 

‘ఒకరోజు మెడిసిన్‌ ప్రభావం ఎక్కువగా పని చేయటంతో నేను గాఢ నిద్రలోకి వెళ్లిపోయా. స్కూలు నుంచి వచ్చిన ఆద్య నన్ను లేపేందుకు ప్రయత్నించింది. అయితే నాలో చలనం లేకపోవటంతో చనిపోతున్నానేమోనంటూ ఏడ్చేసింది. నాకు మెలకువ వచ్చే సరికి ఎదురుగా ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌ అంటూ ఒకటే ఏడుపు. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ, ఏడిస్తే ఆద్య భయపడుతుందని భావించి నవ్వుతూనే.. నేనేం చనిపోనులే, నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావ్? నేను పోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అంటూ చెప్పి ఓదార్చాను అని ఆమె వివరించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడి ముందు తన కూతురు ఎంత సేపు కూర్చుని ప్రార్థించిందో కూడా తనకు తెలీదని చెప్పిన రేణూ ఈ లోకంలో తన పిల్లలే తనకు సర్వస్వం అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement
Advertisement