
పూరి జగన్నాథ్ అమాయక చక్రవర్తి!
"జీవితం ఎవ్వడ్నీ వదలదు అందరి సరదా తీర్చేస్తది" అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి పూరి జగన్నాథ్.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ఎదుట ముందుగా హాజరయ్యారు. దాదాపు 10 గంటలపైగా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. వీటిపై వివరణ ఇస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తర్వాత రోజు ‘సాక్షి’ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆయన తన అధికార పేస్బుక్ పేజీలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఎవరో రాసిన దాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. పూరి జగన్నాథ్ పోస్ట్ యథాతథంగా...
పూరి చేసిన పాపం ఏంటి?
రాజకీయ నాయకుడిలా అదిచేస్తాం ఇది ఇస్తాం...అని మభ్యపెట్టి గెలిచాక మాటమార్చాడా?
మీ నోటికాడ కూడు లాగేసుకొని మీ ఉసురు పోసుకున్నాడా? లేదే. 17యేళ్ళ క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు. గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై వటుడింతై అన్న చందాన కష్టపడి తానెదుగుతూ తనతో వున్న వారిని ఎదగనిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు.
అతనికి తెలిసిందల్లా ఒకటే ప్రేక్షకుడు 100రూపాయలు పెట్టి టికెట్ కొని, ఓ 3గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడటం కోసం వెచ్చిస్తే... ఎలా ఆ ప్రేక్షకున్ని సినిమా చూస్తున్నంత సేపు తనే హీరో అయితే "అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా, ఇలాగే విలన్లని ఇరగ్గొడుతా, హీరోయిన్స్ తోడాన్సులు చేస్తా"అని తన కష్టాన్ని మరిచిపోయి లీనమయ్యేలా సినిమాలు తీయటం తెలుసు.
పూరి straight forwardగా వుంటాడు.అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒకటే ఒకరికి భజన చేయటం,కొమ్ము కాయడం. బుల్లెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తాడు,సందేశాలు సమోసాలు అని సినిమా లో చెబితే ఎవ్వరూ వినరంటాడు. తను చేసే పనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు.హిట్టు ఫట్టుతో సంభంధం లేదు.కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టే మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే మోసం చేస్తే.... మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని, కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు. అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగినింగ్ లోనే "జీవితం ఎవ్వడ్నీ వదలదు అందరి సరదా తీర్చేస్తది" అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి. బాణం బలంగా ముందుకు దూసుకెళ్లాలంటే వెనక్కే లాగాలి. సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకిలేచాడు...మళ్ళీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు.తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిటైతే తనమాట తనే వినడు. అందుకే ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ప్యూజ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ వున్నోడు. అందుకే i love india i hate indians అంటూ మనకు పట్టిన బూజును దులపడానికి ఫిక్సైయ్యాడు. వినడు పూరీ ఎవరి మాటా వినడు.
దర్శకుడంటే పూరిలా వుండాలి మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయి దర్శకుడు అవ్వాలి అని పల్లెటూళ్లో వున్న కుర్రాళ్ళు సైతం కలలుగనే రేంజికి ఎదిగాడు. ప్రతి హీరో హీరోయిన్ ఆమాటకొస్తే ప్రతి ఆర్టిస్టు ఒక్కసారైనా పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు.
చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు, నీలాపనిందలు. సరిగ్గా అదే ఇప్పుడు మన పూరీజగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది! అయినా... ఏ రంగంలో లేవా బొక్కలు? ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్లేమైనా శ్రీరామచంద్రులా? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని అనే సామెతలా వుంది మీడియావాళ్ల యవ్వారం. కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు. పూరీ అదనీ ఇదనీ చివరికి ప్రపంచాన్నే ఏదో చేయబోతున్నాడన్న ఒక భ్రమని అపోహని క్రియేట్ చేస్తున్నారు. జనాలు ఇదే నిజమని నమ్మేంతగా tvల్లో పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదకా పూరీ అండ్ కోని మర్డర్ చేసిన వాళ్ళుగా హైలెట్ చేసి చూపిస్తుండటంతో ఏ పాపం తెలియని వాళ్ల తల్లీతండ్రీ, భార్య పిల్లలు, అన్నాతమ్ముళ్లు అక్కాచెల్లెళ్లూ బంధుమిత్రులు ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నారో TRP రేటింగ్స్ కోసం కక్కుర్తి పడే మీడియా కి అది అనవసరం.
సమాజంలో ఎన్ని సమస్యలు లేవు! రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాల్ని సర్వనాశనం చేసే కుట్రలు, భూకబ్జాలు...ఇలా ఎన్నిలేవని! కానీ మీడియా నైతికవిలువలకి పాతరేసి మరీ అబద్దాల్ని నిజాలుగా నమ్మించాలని కంకణం కట్టుకొని శక్తివంచన లేకుండా ఈ డ్రగ్స్ గురించే ప్రచారం చేస్తుంది. ఇది న్యాయమా? పూరీకూడా మనలాగా సగటు మనిషే. తనకి బాధలుంటాయ్.. సంతోషాలుంటాయ్. బాదల్ని తగ్గించు కోవాలని వాటి నుంచి బయట పడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. అయినా, భూమి మీదున్న ప్రతోడు మనిషే, దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏంలేదు. దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పులపాల్జేశారు. ఆ అప్పులు తీర్చడంకోసం కష్టపడి సంపాదించుకున్న కార్లూ, బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పుండాలి. చీకటవ్వడమే ఆలస్యం, పబ్బుల్లో బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసే ఘనులు ఎంతమందో. చిన్న చిన్న ఓటమిలకే, మనస్పర్థలకే సూసైడ్ లు చేసుకునే పిరికివాళ్ళ కన్నా పూరీ చేశాడని చెబుతున్నది నీచమైందా? కాదు. కాబోదు.
ఒకవేళ పూరీ మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకొని వుంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరివల్లా కాదు. కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది. అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు.