‘అలాంటి వ్యక్తి సినిమాల్లోనే ఉండకూడదు’ | Sakshi
Sakshi News home page

‘అలాంటి వ్యక్తి సినిమాల్లోనే ఉండకూడదు’

Published Sat, Nov 25 2017 9:03 PM

poorna tweets on producer ashok kumar's death - Sakshi - Sakshi

తమిళసినిమా: అలాంటి వ్యక్తి సినీరంగంలోనే ఉండకూడదు..! ఇలా ఎవరిని ఎవరు అన్నారో తెలుసా? సహ నిర్మాత అశోక్‌కుమార్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మరణానికి కందువడ్డీతో వేధించిన ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్‌ అంటూ కొందరు ఆయన్ని దూషిస్తుంటే మరి కొందరు ఆయనికి మద్దతు పలుకుతున్నారు. ఇలా కోలీవుడ్‌లో గరం గరం వాతావరణ నెలకొంది. కాగా అశోక్‌కుమార్‌ సహ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొడివీరన్‌ చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన నటి పూర్ణ అశోక్‌కుమార్‌ మరణించిన వార్త తెలిసిన వెంటనే స్పందించింది.

‘అశోక్‌కుమార్‌ మీరు ఉత్తముల్లోనే ఉత్తములని మాకు తెలుసు, మంచి మనసున్న మనిషి మీరు. మీరెక్కడికీ వెళ్లిపోలేరు. మాతోనే ఉంటారు’. అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అనంతరం ‘అన్బుచెళియన్‌ లాంటి వాళ్లు సినిమా రంగంలోనే ఉండకూడదు. అశోక్‌కుమార్‌ మరణించినా మనమంతా ఒకటి మాత్రం చేయగలం. అశోక్‌కుమార్‌ మరణానికి కారణం అయిన అన్బుచెళియన్‌కు కఠిన శిక్ష పడేలా చేయవచ్చు. అందుకు మనం అంతా చేయి కలపాలి..’  అని మరో ట్వీట్‌ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.ధాను, దర్శకుడు సుందర్‌.సి, నటి దేవయాని, మనోబాలా, శీనూరామస్వామి వంటి పలువురు శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించి మరీ అన్బుచెళియన్‌కు బాసటగా నిలిస్తే, నటి పూర్ణ మాత్రం ధైర్యంగా ఆన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు ఘాటు పదాలతో దూషించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement