మందకొడిగా నడిగర్‌ సంఘం ఎన్నికలు

No Postal Votes For Members In Nadigar Sangam Election - Sakshi

ఎవరికి వారే విజయంపై ధీమా

అయినా అయోమయంలో జట్లు

పెరంబూరు: ఎన్నో మలుపుల తరువాత నడిగర్‌ సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభం అయిన ఈ ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 3644 మంది సభ్యులుండగా.. ఓటు హక్కు అర్హత 3171 మంది సభ్యులు షూటింగ్‌ల కారణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు పోస్టల్‌ ఓటు సమయానికి చేరలేనందున ఓటు వేయలేకపోతున్నానని తెలిపారు

నడిగర్‌సంఘం ఎన్నికల వివాదం, వివరాలు..
2019–2022కు గానూ నడిగర్‌సంఘం ఎన్నికల తేదీని ప్రకటించక ముందు నుంచే వివాదాంశంగా మారింది. ప్రస్తుతం సంఘ నిర్వాహక వర్గం పదవీ కాలం ముగిసిన ఆరు నెలలకు ఎన్నికలను నిర్వహించ తలపెట్టడంతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. సభ్యుల సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుత జట్టుకు 2015లో విజయానికి తీవ్రంగా కృషి చేసిన వారు, గట్టి మద్దతునిచ్చినవారిలో కొందరు వ్యతిరేక జట్టులో చేరి ఆ జట్టును ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నటుడు ఉదయ, ఆర్‌కే.సురేశ్‌ వంటి వారు విశాల్‌కు వ్యతిరేకంగా మారారు. ఇక విశాల్‌ జట్టుకు గతంతో పూర్తి అండదండలు అందించిన నిర్మాత ఐసరిగణేశ్, మద్దతుగా నిలిచిన దర్శక నటుడు కే.భాగ్యరాజ్‌ పోటీగా వచ్చారు. ప్రస్తుత పాండవర్‌ జట్టుకు వ్యతిరేకంగా కొత్త జట్టు స్వామి శంకర్‌దాస్‌ పేరుతో సిద్ధం అయ్యింది.

ఈ దశలో సీనియర్‌ నటుడు రాధారవి అసలు సంఘం ఎన్నికలే జరగవంటూ పేర్కొన్నారు. అదే విధంగా విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి పద్యనాభన్‌ నేతృత్వంలో ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాటు, స్థానికి అడయారులోని ఎంజీఆర్‌ జానకీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆవరణను ఎన్నికలకు వేదికగా ప్రకటించారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక రకంగా పోలీసులే సమస్యకు తెరలేపారని చెప్పవచ్చు. ఆ కళాశాలలో ఎన్నికలు నిర్వహించడానికి శాంతి భద్రతల దృష్ట్యా రక్షణ కల్పించలేమని పోలీసులు తెలిపారు. దీంతో విశాల్‌ ఎన్నికల రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ సమయంలో కొందరు సంఘ సభ్యులు తమను సభ్యత్వం తొలగించారంటూ సంఘాల జిల్లా అధికారిని కలిపి ఫిర్యాదు చేయడంతో సమస్య జఠిలంగా మారింది. 61 మంది సభ్యుల ఫిర్యాదును ఎన్నికల సంఘం జిల్లా అధికారి విచారించి నిజ నిర్ధారణ జరిగే వరకూ నడిగర్‌ సంఘం ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు వెల్ల డించారు. దీంతో విశాల్‌ వర్గం మరోసారి ఆ 61 మంది సభ్యత్వం రద్దుకు కారణాలతో చెన్నై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికల అధికారి పిటిషన్‌పై విచారణ విశాల్‌ వర్గానికి అనుకూలంగా వచ్చింది. ఆ 61 మంది సభ్యతం రద్దు చేయడం సరైన చర్యే అంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల రద్దు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం నడిగర్‌ సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపు విశాల్‌ వర్గం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించింది. అదే విధంగా స్వామి శకరదాస్‌ జట్టు గవర్నర్‌ను కలిశారు.

ఎన్నికలకు వేదిక లభించింది
మొత్తం మీద న్యాయస్థానం తీర్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పోటీ జట్ల వర్గాల ముందు మరో సమస్య నిలిచింది. అదే ఎన్నికల వేదిక. విశాల్‌ జట్టు ఎన్నికలకు వేదిక గురించి తీవ్రంగా చర్చలో మునిగిపోగా, స్వామి శంకర్‌దాస్‌ జట్టు వారు మాత్రం కోర్టు తీర్పును స్వాగతిస్తూనే ఇప్పటి వరకూఎన్నికలు ఎక్కడ నిర్వహించేదీ ఖరారు కాలేదు. ఇతర ప్రాంతాల్లోని సభ్యులకు బ్యాలెట్‌ పత్రాలు పూర్తిగా అందలేదు. నటుడు రజనీకాంత్‌కే బ్యాలెట్‌ పేపర్లు చేరలేదని, ఆయన తరుచూ ఫోన్‌ చేసి అడుగుతున్నారని, పోలీసుల భద్రత విసయం ఏమిటీ? లాంటి విమర్శలను, అయోమయాన్ని ప్రస్‌మీట్‌ పెట్టి మరీ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు వేదిక శనివారం సెట్‌ అయ్యింది. విశాల్‌ జట్టు స్థానిక అల్వార్‌పేటలోని జెయింట్‌ ఎబ్బాస్‌ పాఠశాలలో ఎన్నికల వేదికను సిద్ధం చేశారు. అదే విధంగా శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంను సచివాలయంలో కలిసి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చర్చలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆదివారం నడిగర్‌ సంఘ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. కాగా ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఫలితాలను మాత్రం న్యాయస్థానం ఆదేశాల మేరకు నిలిపేయనున్నారు. న్యాయస్థానం ప్రటించిన తరువాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బహుశ జూలై 5వ తేదీన సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top