ఆ పని మాత్రం చేయను! | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 10:26 AM

Nitya Menon Avoids Acting Offers - Sakshi

తమిళసినిమా: నటి నిత్యామీనన్‌ రూటే వేరని చెప్పవచ్చు. చాలా వరకూ లవ్లీ పాత్రలు చేసిన ఈ మాలీవుడ్‌ భామ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత నిస్తోందనే చెప్పవచ్చు. ఆ మధ్య కాంచన 2 చిత్రంలో దివ్యాంగురాలిగా నటించి మెప్పించిన నిత్యామీనన్, మణిరత్నం దర్శకత్వం చిత్రం కాదల్‌ కణ్మణి చిత్రంలో హీరోతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేసే పాత్రలో నటించి అలరించింది.

అదే విధంగా మెర్శల్‌ చిత్రంలో విజయ్‌కు జంటగా పల్లెటూరి అమ్మాయిగా నటించడానికి బరువు కూడా పెరిగింది. ఇక ఇటీవల తెలుగు చిత్రం ‘అ’లో లెస్బియన్‌ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పాత్రలో నటించిన నిత్యామీనన్‌ను విమర్శించిన వారూ లేకపోలేదు. అలాంటి విమర్శలను డోంట్‌కేర్‌ అంటున్న నిత్యామీనన్‌ మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిలో ఒకటి రెండు చిత్రాలే తన వల్ల నటించడం అవుతుందని అంది. కారణం సాధారణ హీరోయిన్‌ పాత్రలను తాను కోరుకోవడంలేదని చెప్పింది. 

ఇక షూటింగ్‌ స్పాట్‌లో తన పాత్రను డెవలప్‌ చేసుకునే విషయంలోనూ, సంభాషణల గురించి దర్శకుడితో చర్చిస్తానని చెప్పింది. ఎందుకంటే తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని చెప్పింది. అందుకే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నానని అంది. భవిష్యత్‌లో కచ్చితంగా మెగాఫోన్‌ పడతానని, అయితే సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టే పొరపాటును మాత్రం చేయనని అంటోంది. మరి ఈమె దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మాతగా ఎవరు ముందుకొస్తారో చూడాలి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement