పొలిటికల్‌ థ్రిల్‌ | Naveen Chandra New Movie Opening | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ థ్రిల్‌

Apr 16 2019 3:30 AM | Updated on Apr 16 2019 3:30 AM

Naveen Chandra New Movie Opening - Sakshi

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్‌ చంద్ర హీరోగా ఓ కొత్త చిత్రం షురూ అయింది. వేణు మదుకంటి దర్శకత్వంలో యశాస్‌ సినిమాస్‌ పతాకంపై వి. మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కృష్ణచైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో దర్శకుడు సుధీర్‌ వర్మ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు అనీల్‌ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. వేణు మదుకంటి మాట్లాడుతూ– ‘‘వెంకటాపురం’ చిత్రానికి దర్శకునిగా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మంచి స్క్రిప్ట్‌ కోసం టైమ్‌ తీసుకున్నా. మంజునాథ్‌గారితో కలసి ఏడాదిగా ఈ కథపై పని చేశా. ఇప్పటివరకూ రాజకీయ నేపథ్యంలో రాని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. వైజాగ్‌ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో చివరి వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి.

ఇప్పటివరకూ చేయని రోల్‌లో నవీన్‌చంద్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తాడు. జూన్‌ మొదటి వారంలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం అవుతుంది. మంజునాథ్‌గారు ఓ మంచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారనే నమ్మకం మాకుంది’’ అన్నారు. ‘‘యశాస్‌ సినిమాస్‌ బ్యానర్‌లో కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ప్లాన్‌ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథపై వర్క్‌ చేశాం’’ అన్నారు మంజునాథ్‌. ‘‘నా కెరీర్‌లో బాల్‌రెడ్డి (‘అరవింద సమేత వీర రాఘవ’లో చేసిన పాత) పాత్ర పెద్ద మలుపు. ఆ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నా. ఇందుకు త్రివిక్రమ్‌గారికి, ఎన్టీఆర్‌ గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నవీన్‌ చంద్ర. కోట శ్రీనివాసరావు, నాజర్, రావు రమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, మ్యూజిక్‌: అచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement