విజయంతో పాటు గౌరవం | Mental Madilo Success Meet | Sakshi
Sakshi News home page

విజయంతో పాటు గౌరవం

Dec 3 2017 1:26 AM | Updated on Dec 3 2017 1:26 AM

Mental Madilo Success Meet - Sakshi

‘‘పెళ్ళి చూపులు’కు ఎంత పేరొచ్చిందో ‘మెంటల్‌ మదిలో’ చిత్రానికీ అంతే పేరొచ్చింది. సినిమా బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని రాజ్‌ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి నిర్మించిన ‘మెంటల్‌ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా పదిమంది టెక్నీషియన్స్‌ పరిచయమయ్యారు. వీళ్లు  మరో ఇరవై సినిమాలు చేస్తారు.

నా బ్యానర్‌ నుంచి వచ్చిన వారు ఇలా సినిమాలు చేస్తున్నారని గొప్పగా ఫీలవుతా. ఇటువంటివారిలో వివేక్‌ ఆత్రేయ, సంగీత దర్శకుడు ప్రశాంతి విహారి, కెమెరామెన్‌ వేద రామన్, ఎడిటర్‌ విప్లవ్‌ కూడా ఉంటారనడంలో సందేహం లేదు. నేను ఏడాదికి ఒక సినిమా చేయగలను. ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తే కొత్తవారిని నా సినిమాల ద్వారా పరిచయం చేస్తా’’ అన్నారు. ‘‘మంచి హిట్‌తో పాటు గౌరవం తెచ్చిన సినిమా ఇది.

ఈ చిత్రం బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇళయరాజాగారి, ఎ.ఆర్‌. రెహమాన్‌గారి పాటలు విన్నప్పుడు అప్పుడే అయిపోయాయా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ‘మెంటల్‌ మదిలో’ జర్నీలో ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది’’ అన్నారు వివేక్‌ ఆత్రేయ. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు, రచయితలు భాస్కరభట్ల, సిరా శ్రీ, నటి అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement