స్వర్ణయుగం మొదట్లో..

Mani Ratnam unveils first look of Aishwarya Rai and trisha - Sakshi

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. మదరాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది.  ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది.  ‘స్వర్ణయుగం మొదట్లో..’ అంటూ ఈ సినిమా టైటిల్‌ను, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

మణిరత్నం చేసే అన్ని సినిమాలకు దాదాపు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే స్వరకర్త. జయమోహన్‌ మాటల రచయిత. మణిరత్నం, కుమారవేల్‌ సంయుక్తంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, కార్తీ, ‘జయం’రవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top