ట్విస్ట్‌లు ఊహించలేకపోయా! | Kshanam Movie success meet Rana Daggubati | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌లు ఊహించలేకపోయా!

Mar 2 2016 1:18 AM | Updated on Sep 3 2017 6:46 PM

ట్విస్ట్‌లు ఊహించలేకపోయా!

ట్విస్ట్‌లు ఊహించలేకపోయా!

‘క్షణం’ సినిమాను నేనూ, బన్నీ కలిసి చూశాం. ఈ చిత్రం చూసిన తర్వాత ‘నేను సినిమా వాడిని కాదు సినిమా లవర్‌ని’ అనే విషయం గుర్తొచ్చింది.

‘‘ ‘క్షణం’ సినిమాను నేనూ, బన్నీ కలిసి చూశాం. ఈ చిత్రం చూసిన తర్వాత ‘నేను సినిమా వాడిని కాదు సినిమా లవర్‌ని’ అనే విషయం గుర్తొచ్చింది. ఇందులోని ఏ ట్విస్ట్‌నూ ఊహించలేకపోయా. థ్రిల్లర్ తరహాలో ఉండే తెలుగు చిత్రమిది’’ అని హీరో రానా అన్నారు. అడివి శేష్, అదా శర్మ, అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ‘క్షణం’ విడుదలై, ప్రేక్షకాదరణ పొందుతోంది.
 
  ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం నాడు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ఈ విజయోత్సవ సభకు హాజరైన రానా, ‘‘ఈ సినిమా చూసి నాకు ఈర్ష్య కలిగింది. ‘మనకెందుకు ఇలాంటి కథలు దొరకవ’ని ప్రకాశ్‌తో అన్నాను. ‘అడివి శేష్ తన కోసం రాసుకున్న కథ ఇది’ అని చెప్పాడు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశానికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి’’ అని అభిప్రాయపడ్డారు.
 
 ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి మాట్లాడుతూ - ‘‘రవికాంత్ తొలిసారి దర్శకత్వం చేస్తున్నట్లు కాకుండా చాలా అనుభవజ్ఞుడిలా సినిమా తీశాడు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా ఇంత బాగుంటుందని ఊహించలేదు. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు’’ అన్నారు. ‘‘సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సినీ ప్రేమికులకు బాగా నచ్చే చిత్రమిది.
 
 మా బ్యానర్‌లో రానాతో ‘ఘాజి’ చిత్రం తెరకెక్కిస్తున్నాం’’ అని నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్ అన్నారు. ‘‘బన్నీ, రానా, ప్రకాశ్ గారు మా చిత్రం చూసి మెచ్చుకున్నారు. పీవీపీ అనే పెద్ద వేదిక లేకపోతే ఇంత విజయం సాధ్యమయ్యేది కాదు’’ అని దర్శకుడు రవికాంత్ కృతజ్ఞతలు తెలిపారు. అడివి శేష్, లక్ష్మీ మంచు, అనసూయ, ‘సత్యం’ రాజేశ్, కెమేరామ్యాన్ షానిల్ డియో, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement