సస్పెన్స్‌ థ్రిల్లర్‌ స్టార్ట్‌

Kalyan Ram, Nivetha Thomas and Shalini Pandey to team up for #NKR16 - Sakshi

కల్యాణ్‌ రామ్‌ మాంచి జోరుమీదున్నారు. మార్చిలో ‘ఎంఎల్‌ఏ’గా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘నా నువ్వే’ మే 25న విడుదల కానుంది. ‘నా నువ్వే’ నిర్మాణ  సంస్థలోనే కల్యాణ్‌రామ్‌ హీరోగా మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ క్లాప్‌ ఇచ్చారు. నందమూరి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లు. ఈ సందర్భంగా మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘మే 2న  రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు శేఖర్‌ చంద్రగారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తారనే సంగతి తెలిసిందే. ఆయన మా సినిమాకు సంగీతం అందించనుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. కథ చాలా బాగా వచ్చింది’’ అన్నారు గుహన్‌. ‘‘తెలుగులో నా రెండో సినిమా ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు షాలినీ పాండే. ‘‘ఈ చిత్రకథని గుహన్‌గారు తమిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెలలు దూరంగా ఉన్నా. మహేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నివేథా  థామస్‌. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top