రగిలిన జ్వాల

Jwala Movie Launch - Sakshi

ఇప్పటి వరకూ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన తెలుగులో చేస్తున్న స్ట్రయిట్‌ మూవీ ‘జ్వాల’. అరుణ్‌ విజయ్‌ మరో కథా నాయకుడు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఎం. నవీన్‌ దర్శకత్వంలో టి. శివ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్‌ ఆంటోని  మాట్లాడుతూ–‘‘తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్‌ చిత్రమిది. నవీన్‌ చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చింది. నాతో పాటు అరుణ్‌విజయ్, షాలినీ పాండేకి కూడా ఇది చాలెంజింగ్‌ మూవీ.

నా కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా ఉంటుందని చెప్పగలను. ఈ సినిమాలో కీలక పాత్రలు చేయడానికి అంగీకరించిన ప్రకాశ్‌రాజ్, జగపతిబాబుగార్లకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘బ్రూస్‌ లీ, సాహో’ చిత్రాల తర్వాత నేను నటిస్తున్న మూడో స్ట్రయిట్‌ తెలుగు చిత్రమిది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇలాంటి యాక్షన్‌ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్‌ విజయ్‌. ‘‘ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అన్నారు షాలినీ పాండే. ఈ సినిమాకు నటరాజన్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top