అభిమానులకు సారీ...!

అభిమానులకు సారీ...!


ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’  విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు దర్శక- నిర్మాతలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. మోహన్‌లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదలను వాయిదా వేసిన విషయం గురించి చెప్పడానికి శుక్రవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.



కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్ సినిమా విడుదల వాయిదా పడిందంటే అభిమానులు బాధపడతారు. వాళ్లకు సారీ చెబుతున్నాం. మంచి కథ, ఎమోషన్స్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ ఫర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వర్షం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 12నే విడుదల చేయాలంటే హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో లేకుంటే కంటెంట్‌పై ప్రభావం చూపిస్తుంది.



అందుకే సినిమాను కంప్లీట్ క్వాలిటీతో తీసుకు రావాలని వాయిదా వేస్తున్నాం. సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మరో పదిరోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది. ఫస్ట్ లుక్, టీజర్‌తో ‘జనతా గ్యారేజ్’ పై అంచనాలు బాగా పెరిగాయి. వాటిని అందుకోవాలంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం. సాంకేతికంగా మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం’’ అన్నారు. ఇదిలా ఉంటే.. కొరటాల శివ గత చిత్రాలు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ కూడా వాయిదాలు పడి సూపర్ హిట్ అవడం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top